సినీఫక్కీలో దొంగతనం.. రూ. 10 లక్షలు చోరీ.. ధర్జాగా క్యాబ్ బుక్‌చేసుకొని మరీ పరారు

సినీఫక్కీలో దొంగతనం.. రూ. 10 లక్షలు చోరీ..  ధర్జాగా క్యాబ్ బుక్‌చేసుకొని మరీ పరారు

ఈ మధ్య హైదరాబాద్‌లో దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. అంతరాష్ట్ర ముఠాలు నగరంలోనే ఉంటూ.. పెద్ద పెద్ద ఇళ్లే టార్గెట్ చేస్తూ.. చోరీలకు పాల్పడుతున్నారు. ఉదయం పూట రెక్కీ నిర్వహించి.. రాత్రిళ్లు దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ లో భారీ దొంగతనం జరిగింది. వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగుడు సినీఫక్కీలో రూ. 10 లక్షలతో పరార్ అయ్యాడు. 

ఏం జరిగిందంటే..

ఏపీలోని భీమవరానికి చెందిన వ్యాపారి ఎన్‌ఎస్‌ఎన్‌ రాజు కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్ 52లో నివాసముంటున్నారు. వ్యాపార లావాదేవీల నిమిత్తం ఎన్‌ఎస్‌ఎన్‌ రాజు వేరే ప్రాంతానికి వెళ్లాడు. అయితే ఇంట్లో రాజు తల్లి, భార్య, ఎనిమిది నెలల గర్భిణి అయిన కుమార్తె ఉన్నారు. మే 12(శుక్రవారం) తెల్లవారుజామున 4 గంటల సమయంలో ముఖానికి నల్ల ముసుగు ధరించిన ఓ అగంతకుడు ఇంటికి వచ్చాడు. నిచ్చెన సాయంతో మొదటి అంతస్తులోకి వెళ్లి కిటికిల నుంచి  ఓ గదిలోకి చొరబట్టాడు.

అదే గదిలో నిద్రిస్తున్న రాజు కూతురు నవ్య(గర్భిణి) వద్దకు వెళ్లి.. ఆమెను నిద్రలేపి మెడపై కత్తి పెట్టాడు. అరిస్తే చంపేస్తానని దొంగ బెదిరించటంతో ఆమె భయంతో వణికిపోయింది. అయితే నవ్య ఒంటిపై ఉన్న అరకిలో బంగారు ఆభరణాలు, వజ్రాల చెవిదిద్దులు ఇస్తానని చెప్పింది. నాకు బంగారం వద్దు రూ. 20 లక్షలు నగదు మాత్రమే కావాలని దుండగుడు డిమాండ్ చేశాడు. 

రూ. 10 లక్షలతో జంప్

ఉదయం 9 దాటినా కుమార్తె గదిలో నుంచి బయటకు రాకపోవడంతో.. తల్లి లీల వెళ్లి ఆ గది తలుపులు తెరిచింది. నవ్య మెడపై కత్తిపెట్టి ఉన్న దొంగను చూడగానే లీల ఆందోళనకు గురై, కేకలు వేసింది. దీంతో లీలను కూడా ఆగంతకుడు గదిలో బంధించి ఓ మూలన కూర్చోబెట్టాడు. ఆ తర్వాత తనకు డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. బీరువాలో ఉన్న రూ. 2 లక్షలు ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఇంకా డబ్బులు కావాలని వారిని బెదిరించాడు. అయితే నవ్య తన భర్త మనీశ్ రెడ్డికి ఫోన్ చేసి.. విషయాన్ని వివరించింది. మనీశ్ రెడ్డి ..తన స్నేహితుడి ద్వారా మరో 8 లక్షలు వారి ఇంటికి పంపించారు. మెుత్తం రూ. 10 లక్షలు బ్యాగులో పెట్టుకున్న దుండగుడు.. నవ్య ఫోన్ నుంచే క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే ఇంట్లో అందరిని చంపేస్తానని బెదించాడు. ఆ తర్వాత క్యాబ్ రాగానే.. వారిని గదిలో బంధించి అక్కడి నుంచి డబ్బుల బ్యాగ్ తో పరారయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులు వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్‌ఎస్‌ఎన్‌ రాజు ఇంటికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో.. దొంగ ఆధారాల సేకరించారు.