కంబోడియాలో అగ్ని ప్రమాదం.. 19కి చేరిన మృతుల సంఖ్య

కంబోడియాలో అగ్ని ప్రమాదం.. 19కి చేరిన మృతుల సంఖ్య

కంబోడియాలోని గ్రాండ్ డైమండ్ సిటీ హోటల్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరింది. బాంటే మీంచే ప్రావిన్స్ పరిధిలోని పోయ్పెట్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో దాదాపు 60మందికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. ఈ హోటల్ థాయ్ లాండ్ సరిహద్దులో ఉంది. ప్రమాదంలో మృతి చెందిన వారంతా కంబోడియా, థాయ్ లాండ్ దేశాలకు చెందినవారే ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 

హోటల్ లోని మొదటి అంతస్తులో ముందుగా మంటలు చెలరేగినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో లోపల ఉన్న సిబ్బంది, కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీసినట్టు సమాచారం. ఈ క్రమంలో కొందరు కిటికీ అద్దాలు పగలగొట్టి బయటకు దూకే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్ లో దాదాపు 400 మంది ఉన్నారని, ఈ హోటల్ లో మంటలను ఆర్పేందుకు థాయ్ లాండ్ దేశానికి చెందిన సరిహద్దు నగరం నుంచి కూడా అగ్నిమాపక వాహనాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.