తూ.గో.జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రహదారులు జలమయ్యాయి. వరద నీటికి వాగులు, చెరువులు పొంగుతున్నాయి. తుని మండలం కోటనందూరు నర్సీపట్నం మధ్యలో గల వెద్దుళ్ళగడ్డ వాగు నుంచి పొంగి ప్రవహిస్తున్న వర్షపు నీటి ప్రవాహానికి ఓ కారు చిక్కుకుపోయింది. కారులో నలుగురు వ్యక్తులు ఉండగా.. అందులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్టు సమాచారం. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వెళుతుండగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ మరియు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. వీరిలో ముగ్గురుని కాపాడగా ఒక వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.