భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు

భారత్ జోడో న్యాయ్ యాత్రపై  కేసు నమోదు

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రపై  అస్సాంలో కేసు నమోదైంది.  రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్స్‌ లో మార్పులు చేయడంతో పోలీసులు యాత్ర నిర్వాహకుడు కేబీ బైజుపై కేసు నమోదు చేశారు. ఆ రాష్ట్ర  సీఎం హిమంత బిశ్వ శర్మపై రాహుల్ గాంధీ విమర్శలు చేసిన కాసేపటికే ఈ పరిణామం చోటు చేసుకుంది. 

ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో కొనసాగుతుంది. నిర్దేశించిన మార్గంలో కాకుండా.. మరో మార్గం గుండా జనవరి18 గురువారం మధ్యాహ్నాం రోజున రాహుల్‌ యాత్ర సాగిందన్నది పోలీసులు వాదన.  సడన్ గా రూట్‌ను మార్చడం అంతరాయాలకు దారితీసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో  తెలిపారు.  యాత్ర నిర్వాహకులు, సహ నిర్వాహకులు ట్రాఫిక్ బారికేడ్‌లను బద్దలు కొట్టేలా అక్కడి సమూహాన్ని ప్రేరేపించారని ఆరోపించారు. ఈ క్రమంలో అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

యాత్రపై పోలీసులు   కేసు నమోదు చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది..  యాత్రకు అనవసరమైన అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. అందుకే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని అని కాంగ్రెస్‌కు చెందిన అస్సాం ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా మండిపడ్డారు.  యాత్ర కోసం తమకు కేటాయించిన మార్గం చాలా ఇరుకుగా ఉందని, జనాలు పెద్ద సంఖ్యలో హాజరవ్వడంతో కొన్ని మీటర్ల పాటు పక్కనున్న దారి గుండా ప్రయాణించాల్సి వచ్చిందని వివరించారు.  కాగా జనవరి 25వ తేదీ దాకా రాహుల్‌ అస్సాంలో యాత్రలో పాల్గొంటారు.