
గద్వాల / శాంతినగర్ వెలుగు : గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ పనుల అడ్డగింత, వాహనాల ధ్వంసం ఘటనలో 57 మందిపై కేసు నమోదు అయింది. ఫ్యాక్టరీ సీఈవో మంజునాథ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడకు చెందిన చిన్న నరసింహులు, కొంకల నరసింహ, బోయ భరత్, కురువ చిన్న నాగేంద్ర, కాటం, పరశురాముడు, శివ గౌడ్, తిప్పారెడ్డి, సూర్యప్రకాశ్, కురువ భీమన్న, మనోహర్, మోషన్నను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హుజరుపరుచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.
మరో 40 మంది పరారీలో ఉన్నారని, ఐదుగురికి నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు 12 గ్రామాల్లో తనిఖీలు చేస్తున్నారు. కాగా గొడవతో సంబంధం లేని వ్యక్తులను కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కమిటీ సభ్యులు ఘటనాస్థలం వద్ద లేనప్పటికీ వారి పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
మరో వైపు తమపై దాడి చేసిన ఇథనాల్ కంపెనీ సిబ్బంది, యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నించారు. బుధవారం తాము శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు వెళ్లామని, కంపెనీకి సంబంధించిన వ్యక్తులే తమపై దాడి చేసి రెచ్చగొట్టారని ఆరోపించారు.