పంజాగుట్ట, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో గోదావరి నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, అఖిల భారత బహుజన సమాజ్ పార్టీ(ఏఐబీఎస్పీ) జాతీయ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
సీతారామ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో సిల్ట్ తొలగింపు పేరుతో భారీ స్థాయిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇసుక ద్వారా భారీ ఆదాయం వస్తున్నా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి నిధులివ్వడం లేదన్నారు. గోదావరి ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన ఆదాయం, ఖర్చులు, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
