మిల్లింగ్‌‌కు గడువు మరో 4 రోజులే .. పదేండ్లలో మిల్లింగ్ కెపాసిటీ పెరగలే 

మిల్లింగ్‌‌కు గడువు మరో 4 రోజులే .. పదేండ్లలో మిల్లింగ్ కెపాసిటీ పెరగలే 
  • అందుకే సీఎంఆర్ జాప్యం
  • నిరుడు వడ్ల అమ్మకానికి పిలిచిన టెండర్లు రద్దు 
  • మళ్లీ ఫ్రెష్‌‌గా గ్లోబల్‌‌ టెండర్లు 
  • రివైజ్డ్ నోటిఫికేషన్‌‌ జారీ చేసిన సివిల్‌‌ సప్లయ్స్‌‌ శాఖ 

హైదరాబాద్‌‌, వెలుగు :  కస్టమ్‌‌ మిల్లింగ్‌‌ రైస్‌‌ (సీఎంఆర్) ఇవ్వడానికి గడువు సమీపిస్తున్నా ఇప్పటివరకు మిల్లింగ్‌‌ పూర్తి కాలేదు. నిరుడు వానాకాలం వడ్లు ఇవ్వడానికి మరో 4 రోజులే గడువు ఉంది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినా బియ్యం ఇవ్వకపోవడంతో తాజాగా కేంద్రం ఈ నెలాఖరుకు డెడ్ లైన్ పెట్టింది. రాష్ట్రంలో గత పదేండ్లుగా ధాన్యం ఉత్పత్తి పెరుగుదల మేరకు మిల్లింగ్‌‌ కెపాసిటీ పెంచుకోకపోవడం.. ఉన్న కెపాసిటీకి అనుగుణంగా కూడా మిల్లింగ్‌‌ జరగకపోవడంతో మిల్లింగ్‌‌ జాప్యమై సివిల్‌‌ సప్లయ్స్‌‌ కార్పొరేషన్‌‌కు గుదిబండగా మారుతోంది.

రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లతో మిల్లింగ్‌‌ చేయించి ఎఫ్‌‌సీఐకి టైమ్‌‌కు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిరుడు వానాకాలం సేకరించిన వడ్లు నేటికీ మిల్లింగ్‌‌ పూర్తి కాలేదు. తాజాగా ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని మిల్లర్లను ఆదేశించింది. కానీ మిగిలిన ఈ నాలుగు రోజుల్లో మిల్లింగ్‌‌ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మిల్లర్లపై ఒత్తిడి పెంచినా ఏమాత్రం చలనం కనిపించడంలేదు.  

నిరుటి వడ్లే మిల్లింగ్‌‌ కాలే  

నిరుడు వానాకాలం సివిల్‌‌ సప్లయ్స్‌‌ శాఖ 65.02 లక్షల టన్నుల వడ్లు సేకరించింది. ఇందులో మిల్లర్ల నుంచి ఇంకా నాలుగైదు లక్షల టన్నుల బియ్యం పెండింగ్ లోనే ఉంది. గత యాసంగి సీజన్ కు సంబంధించిన వడ్ల మిల్లింగ్ కూడా 77 శాతం పెండింగ్‌‌ పడింది. గత యాసంగిలో 66.84 లక్షల టన్నుల వడ్లను సివిల్ సప్లయ్స్ సేకరించింది. ఈ వడ్లను మిల్లర్ల ద్వారా మిల్లింగ్‌‌ చేయించి 45.07 లక్షల టన్నుల బియ్యాన్ని సమకూర్చి ఎఫ్‌‌సీఐకి అప్పగించాల్సి ఉంది. కానీ కేవలం 10.27 లక్షల టన్నులు.. అంటే 22.80 శాతం మాత్రమే మిల్లింగ్‌‌ పూర్తయింది. ఇంకా 77.20 శాతం మిల్లింగ్‌‌ కావాల్సి ఉంది.  

మిల్లింగ్‌‌ చేయలేక అమ్ముకునే దుస్థితి 

మిల్లింగ్‌‌కు వీలుకాకుండా అత్యధికంగా ఉన్న నిరుడు యాసంగి వడ్లను మిల్లర్లు సకాలంలో మి ల్లింగ్‌‌ చేసే పరిస్థితి లేదు. దీంతో వడ్లు పెద్ద ఎత్తు న మిల్లుల్లో, మిల్లుల బయట కుప్పలుగా పడి ఉన్నాయి. దీంతో లేటైతే మరింత నష్టం వచ్చే ప్రమాదం ఉంది. తాజాగా గవర్నమెంట్‌‌ మార డంతో పెండింగ్‌‌లో ఉన్న ధాన్యం అమ్మకం కోసం ప్రత్యేకంగా గ్లోబల్‌‌ టెండర్లు పిలవాలని నిర్ణయించింది. మిల్లింగ్‌‌ చేయడానికి బదులు టెండర్లు పిలిచి అమ్మడానికి రాష్ట్ర సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెష్‌‌గా గ్లోబల్‌‌ టెండర్లను ఆహ్వానించింది. సేకరించిన ధాన్యంలో తొలి విడతలోత 25 లక్షల టన్నుల ధాన్యాన్ని టెండర్ల ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. 

గత సర్కారు టెండర్లు రద్దు 

నిరుడు సెప్టెంబరు నెలలో అప్పటి ప్రభుత్వం టెండర్లకు నోటిఫికేషన్‌‌ ఇచ్చింది. టెండర్లలో పాల్గొన్న సంస్థలు తక్కువకు కోట్‌‌ చేశాయి. ఈ టెండర్లు ఖరారు చేస్తే భారీగా నష్టం వచ్చే ప్రమాదం ఉందన్న విమర్శలు వచ్చాయి. దీంతో డైలమాలో పడిన గత సర్కారు వడ్లు అమ్మకానికి వెనక్కు తగ్గింది. గత యాసంగిలో క్వింటాల్‌‌కు  రూ.2,060 ఎంఎస్‌‌పీతో 66.85 లక్షల టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించింది.

యాసంగి వడ్ల నూక శాతంపై సర్కారు నాన్చడంతో మిల్లర్లు మిల్లింగ్‌‌ ముందుకు రాలేదు. దీంతో తొలి విడతలో 25 లక్షల టన్నులు టెండర్ల ద్వారా అమ్మకానికి పెట్టారు. 25 లాట్లుగా విభజించి టెండర్లు పిలువగా11 సంస్థలు 54 టెక్నికల్ బిడ్స్ వేశాయి.  సెప్టెంబరు 14న టెక్నికల్ బిడ్స్ తెరవగా 10 సంస్థలకు టెండర్లు దాదాపు ఖరారయ్యాయి. వాస్తవానికి మద్దతు ధరతో క్వింటాల్‌‌ రూ.2,060తో సేకరించగా రవాణా చార్జీలు, బ్యాంకుల వడ్డీలు అన్నీ కలిపి సగటున క్వింటాల్‌‌ రూ.2,300 వరకు అయింది. కానీ క్వింటాల్ కు మినిమమ్ గా రూ.1,618, మాగ్జిమమ్‌‌గా రూ.1,732 బిడ్స్ వచ్చాయి.  

సగటున రూ.1,685 ధర పడింది. ఈ టెండర్లు ఓకే చేస్తే క్వింటాల్‌‌ కు రూ.625.. టన్నుకు  రూ.6,250 వరకు నష్టం వస్తుంది. మొత్తం 25 లక్షల ధాన్యం టెండర్లు ఓకే చేస్తే  రూ.1,562.50 కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గత ప్రభుత్వం పిలిచిన టెండర్లను రద్దు చేసి.. తాజాగా కొత్త సర్కారు రివైజ్డ్‌‌ గ్లోబల్‌‌ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది.