లోటు బడ్జెట్

లోటు బడ్జెట్

మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశంలో కేంద్ర బడ్జెట్​ను కేంద్ర ప్రభుత్వం, ఏ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్​ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందిస్తాయి. కేంద్ర పాలిత ప్రాంతాల బడ్జెట్​ వ్యవహారం కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. భారతదేశ బడ్జెట్​ ముసాయిదా వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్​కు సమర్పిస్తుంది. 2017 నుంచి బడ్జెట్​ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టి మార్చి నెలలో చర్చించి మార్పులు, చేర్పులు చేసి పార్లమెంట్​ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి తెస్తున్నారు. ​ 

బడ్జెట్​ అంటే ప్రభుత్వ వార్షిక విత్త ప్రణాళిక అని చెప్పవచ్చు. రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేసే విధానాలను సూచిస్తుంది. బడ్జెట్​ రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ రసీదులు, చెల్లింపులకు సంబంధించిన పరిణాత్మక విలువను తెలియజేస్తుంది. రాబోయే సంవత్సరంలో చేపట్టాల్సిన పథకాలు, వ్యూహాలను సూచిస్తుంది. 

రాజ్యాంగం ప్రకారం రెవెన్యూ వ్యయ ఖాతాను ఇతర ఖాతాల నుంచి వేరుగా చూపించాలి. అందువల్ల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్​ను రెండు ఖాతాలుగా వర్గీకరించారు. 1. రెవెన్యూ బడ్జెట్​ 2. మూలధన బడ్జెట్​

రెవెన్యూ బడ్జెట్​: ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరిగే ప్రభుత్వ లావాదేవీలన్నీ రెవెన్యూ బడ్జెట్​లో చూపుతారు. రెవెన్యూ బడ్జెట్​లో రెవెన్యూ రాబడులు, రెవెన్యూ వ్యయం భాగాలుగా ఉంటాయి. 

రెవెన్యూ వ్యయాలు: ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ప్రభుత్వం చేసే వ్యయం రెవెన్యూ వ్యయం. ఇది ప్రభుత్వ యంత్రాంగం నడపటానికి చేసే వ్యయం. ఇందులో రుణాలపై వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, రక్షణ వ్యయం మొదలైనవి. రెవెన్యూ వ్యయం వల్ల దేశంలో ఎలాంటి ఆస్తి సృష్టించబడదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చే విరాళాలు కూడా రెవెన్యూ వ్యయంగానే పరిగణించాలి. రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని రెవెన్యూ లోటుగా వర్ణిస్తారు. 

మూలధన బడ్జెట్

కేంద్ర ప్రభుత్వం చేసే వ్యయం, లావాదేవీలు ఆస్తులు సృష్టించడానికి ఉపయోగపడితే దాన్ని క్యాపిటల్​ బడ్జెట్​ అంటారు. దేశంలో ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణాలు దీని కిందికి వస్తాయి. ఇందులో రెండు భాగాలుంటాయి. ఎ. మూలధన రాబడి బి. మూలధన వ్యయం

ఎ. మూలధన రాబడులు: కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాల నుంచి సేకరించిన రుణాల మొత్తం మూలధన రాబడిగా చెప్పవచ్చు. అవి రెండు రకాలు

మార్కెట్​ నుంచి తీసుకొనే రుణాలు: ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం సేకరించిన రుణాలు(మార్కెట్​ రుణాలు), చిన్న పొదుపు మొత్తాలు, ప్రావిడెంట్​ ఫండ్​ మొత్తాలు, ట్రెజరీ బిల్లుల రూపంలో రిజర్వు బ్యాంకు నుంచి చేసే రుణం. విదేశీ ప్రభుత్వాల నుంచి, సంస్థల నుంచి సేకరించే రుణాలు. ఈ రెండింటిలో మార్కెట్​ నుంచి తీసుకొనే రుణాలే అధికంగా ఉంటాయి. 

రుణేతర రాబడులు: రుణేతర రాబడుల్లో ప్రభుత్వ ఆస్తుల విక్రయం ద్వారా, ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా, గతంలో ప్రభుత్వమిచ్చిన రుణాలను వెనక్కి తీసుకోవడం ద్వారా రాబడిని సమకూర్చుకుంటాయి. 

బి. మూలధన వ్యయం: ప్రభుత్వ ఆస్తులను సృష్టించి, వాటి నుంచి ఆదాయాన్ని కల్పించడానికి చేసే వ్యయం మూలధన వ్యయం అంటారు. జాతీయ ప్రాజెక్టులు, పరిశ్రమలపై చేసే వ్యయం ఈ వర్గానికి చెందుతుంది. 

1. భూమి, భవనాలు, యంత్ర పరికరాలు, షేర్లలో పెట్టుబడి వ్యయం 2. రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, ప్రభుత్వ కంపెనీలకు కార్పొరేషన్లకు విదేశీ ప్రభుత్వాలకు ఇచ్చే రుణాలు. 3. రక్షణ మూలధన వ్యయం ఇందులో భాగాలుగా ఉంటాయి. మూలధన రాబడి కంటే మూళన వ్యయం ఎక్కువగా ఉంటే మూలధన లోటు అంటారు. 

లోటు బడ్జెట్​: మాంద్యకాలంలో లోటు బడ్జెట్​ వల్ల ప్రభుత్వ వ్యయం పెరిగి ప్రజల ఆదాయాలు, కొనుగోలు శక్తి పెరిగి నెమ్మదిగా ధరలు పెరగడం వల్ల ప్రైవేట్​ పెట్టుబడిదారులు ఉత్సాహంతో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తారు. అంటే నిరాశపూరిత ఆర్థిక వ్యవస్థలో ఆశాజనక వాతావరణం సృష్టించబడుతుంది. అభివృద్ధి పనులపై చేసే వ్యయం కంటే ప్రభుత్వం సేకరించే రాబడి వనరులు తక్కువగా ఉన్నప్పుడు లోటు ఏర్పడును. దీనికోసం ప్రభుత్వం వనరులను వివిధ మార్గాల నుంచి సేకరిస్తుంది. ఇది మార్కెట్​ రుణాలు, రిజర్వుబ్యాంకు వద్ద దాచిన ప్రభుత్వ నిల్వలు వాడటం, రిజర్వు బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం మొదలైనవి.  

లోటు రకాలు

రెవెన్యూ లోటు: రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువైతే రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. 

బడ్జెట్​ లోటు: మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయం ఎక్కువైతే బడ్జెట్​ లోటు ఏర్పడుతుంది. 
కోశలోటు: బడ్జెట్​ లోటు, మార్కెట్​ రుణాలను కలిపితే కోశ లోటు వస్తుంది.

ద్రవ్యీకరించబడిన లోటు: నూతన కరెన్సీని ముద్రించడం ద్వారా భర్తీ చేసే లోటును ద్రవ్యీకరించబడిన లోటు అంటారు. దీనివల్ల ద్రవ్య సప్లయ్​ పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది.

ప్రాథమిక లోటు: కోశలోటుకీ, వడ్డీ చెల్లింపులకు మధ్య వ్యత్యాసమే ప్రాథమిక లోటు. ప్రభుత్వ రుణంలో వడ్డీ చెల్లింపులు పోగా ఎంత మొత్తం ప్రస్తుత వ్యయానికి అందుబాటులో ఉంటుందో తెలియజేసే దానిని ప్రాథమిక లోటు అంటారు. 

రెవెన్యూ రాబడులు

పన్నుల రాబడి, పన్నేతర రాబడుల మొత్తాన్ని రెవెన్యూ రాబడి అంటారు. వీటిలో పన్నుల నుంచి అధిక రాబడి వస్తుంది. 

పన్నుల రాబడి: కేంద్ర ప్రభుత్వం విధించే అన్ని పన్నులు, సుంకాల నుంచి లభించే రాబడిని పన్నుల రాబడి అంటారు. ప్రభుత్వానికి రాబడి సమకూర్చే పన్నుల్లో ముఖ్యమైనవి కార్పొరేషన్​ పన్ను, ఆదాయపు పన్ను, ఎగుమతి, దిగుమతి సుంకం, ఎక్సైజ్​ సుంకం, జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంత పన్నులు. కొత్త పన్నులు విధించడం, పన్ను రేట్లు మార్పులు, ప్రస్తుతం ఉన్న పన్నులను కొనసాగించడానికి ఫైనాన్స్​ బిల్లు ప్రతిపాదన అవసరం. ఇది పార్ల​మెంట్​ ఆమోదం పొందాలి. 

పన్నేతర రాబడి: కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా కాకుండా వేరే మార్గాల ద్వారా లభించే రాబడి పన్నేతర రాబడి అంటారు. పన్నేతర రాబడులు లభించే మార్గాల్లో ముఖ్యమైనవి. 

ప్రభుత్వరంగ సంస్థల లాభాలు, డివిడెండ్లు, ప్రభుత్వానికొచ్చే వడ్డీలు, వాణిజ్యపర లాభాలు, ప్రభుత్వ సేవలు, బహిర్గత గ్రాంట్లు, ఇతర పన్నేతర రాబడి మొదలైన భాగాలు. వీనిలో అతిపెద్ద రాబడి డివిడెండ్లు – లాభాలు.

బడ్జెట్​ రకాలు

సంతులిత బడ్జెట్: రాబోయే సంవత్సరంలో చేసే వ్యయాలు, రాబడులకు సమానమైతే దాన్ని సంతులిత బడ్జెట్​ అంటారు. అప్పుడు మిగులు కాని లోటు కాని ఉండదు. ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తేనే సంతులిత బడ్జెట్​ విధానాన్ని పాటించడానికి వీలవుతుంది. 

అసంతులిత బడ్జెట్​: రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ వ్యయాలు, రాబడులకు సమానంగా లేని యెడల అది అసంతులిత బడ్జెట్​. అప్పుడు ప్రభుత్వ బడ్జెట్​ మిగులు బడ్జెట్​, లోటు బడ్జెట్​గా ఉండవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూలధన కొరత సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం రుణాలు సేకరించి అసంతులిత బడ్జెట్​ను అనుసరిస్తున్నాయి. 

ఆధారిత బడ్జెట్​: గడిచిన సంవత్సర కేటాయింపుల ఆధారంగా వర్తమాన సంవత్సర బడ్జెట్​ కేటాయింపులు జరిగితే దానిని ఆధారిత బడ్జెట్​ అంటారు.