ఇదెక్కడి న్యాయం..? ఎయిర్ పోర్టుల ఏర్పాటులో ఏపీకి పైసల సంచి.. తెలంగాణకు మొండిచెయ్యి

ఇదెక్కడి న్యాయం..? ఎయిర్ పోర్టుల ఏర్పాటులో ఏపీకి పైసల సంచి.. తెలంగాణకు మొండిచెయ్యి
  • ఏపీలోని తాడెపల్లిగూడెం ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ భూసేకరణకు రూ.1,570 కోట్లు
  • మామునూరు ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌కు పైసా ఇవ్వని మోదీ సర్కార్‌‌‌‌
  • రాష్ట్ర ప్రభుత్వంపైనే రూ. 205 కోట్ల భూ సేకరణ భారం 
  • రామగుండం, నిజామాబాద్‍, భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్‌‌‌‌పోర్టులకూ నో హెల్ప్‌‌‌‌

వరంగల్‍, వెలుగు: ఎయిర్‌‌‌‌పోర్టుల ఏర్పాటు విషయంలో ఏపీపై వల్లమాలిన ప్రేమ చూపుతున్న కేంద్రం.. తెలంగాణను మాత్రం ఎట్టికి వదిలేస్తోంది. తెలంగాణ మొత్తంలో హైదరాబాద్‌‌‌‌లో ఒకే ఒక్క ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఉండగా.. ఇటీవలే వరంగల్‌‌‌‌లోని మామునూరు, రామగుండంలో ఎయిర్‌‌‌‌పోర్టుల నిర్మాణానికి గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ వచ్చింది. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. ఏపీలో ఏర్పాటు చేసే విమానాశ్రయానికి వందల కోట్లు కేటాయించిన కేంద్రం.. తెలంగాణలోని ఎయిర్‌‌‌‌పోర్టులకు మాత్రం నయాపైసా ఇవ్వడం లేదు. పైగా భూసేకరణ ఖర్చును సైతం రాష్ట్ర ప్రభుత్వమే భరించుకోవాలని ఉచిత సలహాలిస్తోంది.

ఏపీలోని తాడేపల్లిగూడెం ఎయిర్‌‌‌‌పోర్టుకు రూ.1,570 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌‌‌‌ రాష్ట్రంలో ఇప్పటికే ఏడు ఎయిర్‌‌‌‌పోర్టులు సేవలు అందిస్తున్నాయి. ఇందులో విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతిలో ఇంటర్నేషనల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టులు ఉండగా... కర్నూలు, కడప, పుట్టపర్తి, రాజమండ్రి దేశీయ విమానాశ్రయాలుగా కొనసాగుతున్నాయి. తాజాగా ఉడాన్‌‌‌‌ పథకం కింద పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మరో గ్రీన్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చింది. 

దీనికి సంబంధించి ఉంగుటూరు మండలంలో 1,123 ఎకరాల అటవీ భూములను గుర్తించారు. ఇవన్నీ ప్రభుత్వ భూములే అయినప్పటికీ.. ఈ భూములను ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌కు ఇవ్వాలంటే అందుకు రెట్టింపు భూములను కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు అప్పగించాల్సి ఉంటుందని చెబుతున్నారు. తాడేపల్లిగూడెంలో ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. దానికి అవసరమైన భూసేకరణ ఖర్చును సైతం తామే భరిస్తోంది. ఇందుకోసం మోదీ సర్కార్‍ ఏకంగా రూ.1,570.64 కోట్లు మంజూరు చేసింది. ఇదే విషయాన్ని అక్కడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌‌‌‌ మంగళవారం వెల్లడించారు. 

మామునూరులో 253 ఎకరాలకు నో ఫండ్స్‌‌‌‌

తెలంగాణలో మామునూరు ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ను తిరిగి ప్రారంభించేందుకు సుమారు 20 ఏండ్లు ప్రయత్నాలు జరిగాయి. అయితే హైదరాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌కు 150 కిలోమీటర్ల దూరం వరకు మరో ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఉండకూడదని జీఎంఆర్‌‌‌‌ సంస్థతో చేసుకున్న ఒప్పందంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. మరో వైపు 45 ఏండ్ల కిందే మామునూరు ఎయిర్‌‌‌‌పోర్టు మూతపడడంతో భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ క్రమంలో ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ పునఃప్రారంభానికి 949.14 ఎకరాలు అవసరం అవుతాయని తేల్చగా ప్రస్తుతం 696.14 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి.

 మరో 280.30 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ప్రభుత్వ భూములు పోను ఫైనల్‍గా 220 ఎకరాల సాగు భూమి, మరో 33 ఎకరాల వరకు ప్లాట్లతో కలిపి మొత్తం 253 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జీఎంఆర్‍ సంస్థతో ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని కాంగ్రెస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ క్లియర్‌‌‌‌ చేసింది. ఇదే టైంలో భూసేకరణ విషయంలో కేంద్రం మెలిక పెట్టింది. మామునూరు ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ నిర్మాణం జరగాలంటే అందుకు అవసరమైన 253 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి ఎయిర్‍పోర్ట్‌‌‌‌ అథారిటీ ఆఫ్‍ ఇండియా(ఏఏఈ)కు అప్పగించాలని చెప్పింది.

 దీంతో భూసేకరణ కోసం రూ.205 కోట్లు మంజూరు చేస్తూ గతేడాది నవంబర్‍ 17న కాంగ్రెస్‍ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 220 ఎకరాలకు సంబంధించిన 309 మంది రైతులు, 61,134.5 గజాల కమర్షియల్‍ ప్లాట్లకు సంబంధించిన 50 మంది ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోవడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.205 కోట్లే కాకుండా మరో రూ.200 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది.

తెలంగాణపై కేంద్రం వివక్ష

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఎయిర్‍పోర్టుల నిర్మాణంపై వివక్షచూపుతోంది.  విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్న కేంద్రం.. అందుకు అవసరమైన, భారీ బడ్జెట్‌‌‌‌తో కూడుకున్న భూసేకరణ ఖర్చును మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నెత్తినే రుద్దుతోంది. ఏపీలో ఇప్పుడున్న ఏడు ఎయిర్‍పోర్టులను 14కు పెంచుకునేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తాడేపల్లిగూడెం విమానాశ్రయానికి అవసరమయ్యే భూసేకరణకు రూ.1,570 కోట్లు భరించిన కేంద్రం.. వినుగొండ, దగదర్తి, ఓర్వకల్లు, కుప్పంతో పాటు భోగాపురంలోనూ అంతర్జాతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించేందుకు రెడీగా ఉంది. 

కానీ తెలంగాణలో హైదరాబాద్‌‌‌‌ తర్వాత మామునూరులో నిర్మించబోయే ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌కు 253 ఎకరాల భూసేకరణకు నయా పైసా కేటాయించడం లేదు. అయితే ఏపీకి చెందిన ఎంపీ కింజారపు రామ్మోహన్‌‌‌‌నాయుడు మోదీ మంత్రివర్గంలో పౌరవిమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతుండడం వల్లే ఆ రాష్ట్రానికి భారీ మొత్తంలో నిధులిస్తూ.. తెలంగాణను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం నుంచి మోదీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్న కిషన్‌‌‌‌రెడ్డి, బండి సంజయ్‌‌‌‌ స్పందించి ఎయిర్‍పోర్ట్‌‌‌‌ భూ సేకరణ నిధుల విషయంతో పాటు నిజామాబాద్‍, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌లకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.