కరోనాపై మాక్ డ్రిల్...రాష్ట్రాలు రెడీగా ఉండండి

కరోనాపై మాక్ డ్రిల్...రాష్ట్రాలు రెడీగా ఉండండి

దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతున్న  క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. ఏప్రిల్ 10, 1 తేదీల్లో రాష్ట్రాల్లోని అన్ని ఆసుపత్రుల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లపై మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. అలాగే ఏప్రిల్ 8, 9 తేదీలలో  జిల్లా ఉన్నతాధికారులు, వైద్యాధికారులతో  కరోనా సంసిద్ధతపై సమీక్షించాలని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులను కోరింది.  రోజు రోజుకు కరోనావైరస్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో... కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని మరియు COVID-19 ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఆందోళన వద్దు..

దేశంలోని పలు రాష్ట్రాల్లోని కరోనా  వ్యాప్తిపై మన్సుఖ్ మాండవియా ఆరా తీశారు. కరోనా టెస్టులతో పాటు, జీనోమ్ సీక్వెన్సింగ్‌ గురించి ప్రస్తావించారు. ప్రజలు ఆందోళన చెందకూడదని.. అప్రమత్తంగా ఉండి కోవిడ్ ను  అడ్డుకోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాల ఆరోగ్యమంత్రులు రివ్యూ మీటింగ్‌లు నిర్వహించాలని తెలిపారు. ప్రికాషనరీ డోసులు పంపిణీ చేయాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీష్ రావు కోరగా..రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని కొనుగోలు చేసుకోవాలని చెప్పారు. 

హాట్ స్పాట్లను గుర్తించండి..

ఇన్‌ఫ్లుఎంజా -వంటి అనారోగ్యం, తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ (SARI) కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి... అత్యవసర హాట్‌స్పాట్‌లను గుర్తించాలని  మన్సుఖ్ మాండవియా సూచించారు. కోవిడ్ పరీక్షలు, టీకాలను వేగవంతం చేయాలన్నారు. కోవిడ్-19 నివారణ, నిర్వహణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 

కరోనా కొత్త వేరియంట్ XBB.1.5, ఇతర ఆరు  వేరియంట్‌లను (BQ.1, BA.2.75, CH.1.1, XBB, XBF, XBB) నిశితంగా ట్రాక్ చేస్తున్నామన్నారు. ఓమిక్రాన్ తో పాటు..దాని అనుబంధ కేసుల వ్యాప్తి తక్కువగా ఉన్నాయన్నారు. అయితే XBB.1.16 ప్రాబల్యం ఫిబ్రవరిలో 21.6 శాతం నుండి మార్చి, 2023లో 35.8 శాతానికి పెరిగిందని చెప్పారు. కానీ వీటి వల్ల ఆసుపత్రిలో చేరడం లేదా మరణాల సంఖ్య పెరిగినట్లు  నివేదికలు అందలేదన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా కోవిడ్ నిర్థారణ పరీక్షలను పెంచాలని సూచించారు. 

కేసుల పెరుగుదల..

మార్చి 17న  571 కేసులు నమోదైతే...ఏప్రిల్ 7తో ముగిసే సరికి సగటు రోజువారీ కేసుల సంఖ్య 4,188కి పెరిగిందన్నారు.  అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 88,503 రోజువారీ సగటు కేసులు నమోదయ్యాయన్నారు. గత వారంలో గ్లోబల్ కేసులు మొదటి ఐదు దేశాల్లో  62.6 శాతంగా ఉన్నాయని  తెలిపారు. కోవిడ్ ను అడ్డుకోవాలంటే వ్యాక్సిన్ పంపినీ, జాగ్రత్తలు తీసుకోక తప్పదన్నారు. అర్హులైన ప్రజలందరికీ..ముఖ్యంగా వృద్ధులకు  టీకాలు వేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రి సూచించారు.

ఏ ఏ రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల..

దేశంలో 10 లేదా అంతకంటే ఎక్కువ జిల్లాల్లో 10 శాతానికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలలో కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కర్ణాటక, కేరళలో ఐదు జిల్లాల్లో 5 శాతానికి పైగా కరోనా కేసులు బయటపడ్డాయి.