హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రేవంత్ అమెరికా పర్యటన ఉద్దేశంగా స్పష్టంగా చెప్పలేదని.. సీఎం హోదాకు తగ్గట్టుగా పర్యటన లేకపోవడంతోనే అనుమతి ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. బ్రిటన్ టూర్ కు మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్లు తెలిపింది. ప్రముఖుల విదేశీ పర్యటనల పర్మిషన్పై రివ్యూ చేస్తామన్నారు.
ఆగస్ట్ 20 నుంచి 30 వరకు పది రోజుల పాటు యునైటెడ్ కింగ్ డమ్ (యూకే), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆగస్ట్ 20 అర్ధరాత్రి 12.30 గంటలకు న్యూఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో సీఎం లండన్ బయలుదేరారు.
ఆగస్ట్ 22 వరకు లండన్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని.. 23న బ్రిటన్ నుంచి అమెరికాలోని బోస్టన్ చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో సీఎం అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కేవలం బ్రిటన్ టూర్ కు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. కేంద్రం అనుమతి నిరాకరించడంతో బ్రిటన్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్ నేరుగా ఇండియా రానున్నారు.
