- 40 శాతం సప్లయ్ బంద్
న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) సరఫరా భారీగా తగ్గడంతో కేంద్రం కొత్త మార్కెట్ల కోసం వెతుకుతోంది. గ్యాస్ అవసరాల కోసం పూర్తిగా మిడిల్ ఈస్ట్ దేశాలపై ఆధారపడుతున్న ఇండియా, ఇరాన్–అమెరికా యుద్ధంతో ఇతర దేశాలతో సంప్రదింపులు మొదలు పెట్టింది.
ఆస్ట్రేలియా, కెనడాతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, గ్యాస్ సరఫరా చేయడానికి ఇవి సుముఖంగా ఉన్నాయని సంబంధిత వ్యక్తులు తెలిపారు. ప్రస్తుతం ఇండియా రోజుకు 195 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పెర్ డే (ఎంఎంఎస్సీఎండీ) గ్యాస్ను దిగుమతి చేసుకుంటోంది.
ఇందులో 60 మిలియన్ ఎంఎంఎస్ఎండీ ఖతర్ నుంచి వస్తోంది. ఒక్క ఖతర్ నుంచే 40 శాతం గ్యాస్ సప్లయ్ అవుతోంది. ఇరాన్ దాడులు చేయడంతో ఖతర్ ఎనర్జీకి చెందిన ఎల్ఎన్జీ కేంద్రాల్లో ఉత్పత్తి ఆగిపోయింది. ఈ కంపెనీ ఫోర్స్ మెజర్ నోటీసులు జారీ చేసింది. అంటే ఒప్పందం ప్రకారం గ్యాస్ సప్లయ్ చేయలేమని చేతులెత్తేసింది.
ఇలాంటి టైమ్లో ఇతర దేశాల నుంచి గ్యాస్ కొనడం అనివార్యం అయ్యింది. భారత్ క్రూడ్, ఎల్పీజీ కొనుగోళ్ల కోసం ప్రధాన ఉత్పత్తిదారులు, ట్రేడర్లతో చర్చలు జరుపుతోంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ), ఒపెక్తో పాటు అమెరికాతో కూడా షిప్ ఇన్సూరెన్స్ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల యూఏఈ, యూఎస్తో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రభుత్వం రోజుకు రెండు సార్లు ఎనర్జీ పరిస్థితులను సమీక్షిస్తోందని, ప్రస్తుతం కొరత లేదని గవర్నమెంట్ వర్గాలు చెబుతున్నాయి.
గ్యాస్ ధరలు పెంచిన అదానీ
పరిశ్రమలకు సప్లయ్ చేస్తున్న గ్యాస్ ధరలను అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ఏటీజీఎల్) పెంచింది. రోజువారీ కాంట్రాక్ట్ సైజ్లో 40శాతానికి మించి వినియోగించిన గ్యాస్పై ప్రతి స్టాండర్డ్ క్యూబిక్ మీటర్కు రూ.119 వసూలు చేయనుంది. ఇంతకు ముందు ధరలు సుమారు రూ.40 ఉండేవి. గ్యాస్ సప్లయ్ తగ్గడంతో ధరలు పెంచింది.
9.5 మిలియన్ బ్యారెల్స్ రష్యన్ ఆయిల్ రెడీ
ఇండియా తీరానికి సమీపంలో వివిధ షిప్లలో 9.5 మిలియన్ బ్యారెల్స్ రష్యన్ ఆయిల్ రవాణా అవుతోందని, ఇప్పుడు ఈ ఆయిల్ను భారత్కు సప్లయ్ చేసేందుకు రష్యా ముందుకొచ్చిందని ట్రేడ్ రీసెర్చ్ కంపెనీ కెప్లర్ పేర్కొంది. మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ రావడంలో అంతరాయం ఏర్పడింది. ఈ గ్యాప్ను భర్తీ చేయడానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రష్యన్ ఆయిల్ను పెద్ద మొత్తంలో కొనేందుకు సిద్ధమయ్యాయి. షిప్పింగ్ సోర్స్ల ప్రకారం, సూయజ్ మ్యాక్స్ ట్యాంకర్ ఓడూన్ మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ను ఐఓసీకి డెలివరీ చేసేందుకు ఇండియాలోని పారాదీప్ పోర్ట్ దగ్గర ఆగింది.
ఏడు లక్షల బ్యారెల్స్ రష్యన్ ఆయిల్ను మోస్తున్న మరో షిప్ వాడినర్ పోర్ట్ దగ్గర ఆగింది. ఈ ఆయిల్ను కూడా ఐఓసీ కొనుగోలు చేస్తోంది. ఇండియన్ ఓసియన్, అరేబియన్ సముద్రంలో దాదాపు 30 మిలియన్ బ్యారెల్స్ రష్యన్ ఆయిల్ అందుబాటులో ఉందని, ఇండియన్ రిఫైనరీలు తొందరగా రెస్పాండ్ కాకపోతే షిప్లు చైనాకు వెళ్లొచ్చని కెప్లర్ చెబుతోంది.
ఇండియా ఆయిల్ సప్లయ్లో కేవలం 40శాతం క్రూడ్ మాత్రమే హోర్మూజ్ జలసంధి ద్వారా వస్తుండగా, మిగతా 60శాతం ఇతర వనరుల నుంచి వస్తోంది. దీంతో ఆయిల్ కొరత లేదు. ప్రస్తుతం భారత్ వద్ద 25 రోజుల క్రూడ్ నిల్వ, 25 రోజుల పెట్రోల్, డీజిల్ నిల్వ ఉంది.
