
- రూ.9 లక్షల వరకు ఇచ్చే అవకాశం
- అర్హులను గుర్తించే పనిలో బ్యాంకులు
- రూ.60 వేల కోట్లతో కొత్త స్కీమ్!
న్యూఢిల్లీ: సిటీలలోని స్లమ్స్ లేదా అద్దె ఇండ్లలో నివసిస్తున్న మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు కేంద్రం త్వరలో శుభవార్త చెప్పే అవకాశం కనిపిస్తోంది. హోమ్ లోన్ల వడ్డీ భారంలో కొంత భాగాన్ని ప్రభుత్వం పంచుకోనుంది. ఇందుకోసం త్వరలో రూ.60 వేల కోట్లతో ఓ కొత్త స్కీమ్ను తీసుకురానుందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ఈ స్కీమ్ను ఈ ఏడాది చివరిలో జరగనున్న కొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ ముందు అమల్లోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం వచ్చే ఏడాది ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని కొత్త స్కీమ్లు తెస్తోంది. తాజాగా కుకింగ్ గ్యాస్పై 18 శాతం రాయితీని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అఫోర్డబుల్ హౌసింగ్పై ఫోకస్ పెట్టినట్టు రాయిటర్స్ వెల్లడించింది. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఈ స్కీమ్ గురించి మోదీ మాట్లాడారు.
6.5 శాతం వరకు రాయితీ..
బారోవర్ల హోమ్ లోన్లపై పడే వడ్డీలో 3 శాతం నుంచి 6.5 శాతం వరకు ప్రభుత్వం రాయితీ ఇవ్వనుందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. గరిష్టంగా రూ.9 లక్షల వరకు వడ్డీ భారం తగ్గుతుందని వెల్లడించింది. రూ.50 లక్షల కంటే తక్కువ అమౌంట్ను 20 ఏళ్ల కాల పరిమితికి గాను తీసుకున్న వారు ఈ స్కీమ్కు అర్హులు. స్కీమ్కు సంబంధించి పూర్తి డిటైల్స్ ఇంకా బయటకు రాలేదు. రాయితీని ఇప్పటికే హోమ్ లోన్లు తీసుకున్న వారికి ఇస్తారా? లేదా కొత్తగా తీసుకునేవారికి ఇస్తారా? అనేది తెలియదు. అర్హులను గుర్తించే పనిలో బ్యాంకులు ఉన్నాయని రాయిటర్స్ వెల్లడించింది. ‘అర్హుల హౌసింగ్ లోన్ అకౌంట్లో వడ్డీ రాయితీని ప్రభుత్వం ముందుగానే క్రెడిట్ చేస్తుంది. ఈ స్కీమ్ చివరి దశలో ఉంది. అమల్లోకి తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం అవసరం’ అని ఒక అధికారిని కోట్ చేస్తూ రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
25 లక్షల మందికి ప్రయోజనం..
ఈ స్కీమ్తో సిటీలలో నివసిస్తున్న 25 లక్షల మంది అభ్యర్ధులు ప్రయోజనం పొందుతారు. ప్రభుత్వం ఇచ్చే వడ్డీ సబ్సిడీ సంబంధిత ఇల్లుకు ఉన్న డిమాండ్ బట్టి మారుతుందని ప్రభుత్వ అధికారి ఒకరు అన్నారు. ‘సిటీల్లోని స్లమ్లలో, కిరాయి ఇండ్లలో, గుర్తింపులేని కాలనీలలో ఉంటున్న వారికి మేలు చేసేందుకు త్వరలో ఓ స్కీమ్తో వస్తాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ తన ఎర్రకోట స్పీచ్లో భాగంగా పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద ఎంత మేర అప్పులివ్వాలనే టార్గెట్ ఏం లేదని, ప్రభుత్వ అధికారులతో త్వరలో ఓ సమావేశం ఉంటుందని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. ఈ మీటింగ్కు ముందు అర్హులను గుర్తించే పనిలో బ్యాంకులు ఉన్నాయని అన్నారు. ఈ స్కీమ్ వలన తమ హోమ్ లోన్ పోర్టుఫోలియోలో అఫోర్డబుల్ హౌసింగ్ లోన్లు పెరుగుతాయని వివరించారు. కాగా, హోమ్ లోన్లపై వడ్డీ రాయితీలు ఇవ్వడం ఇదేమి మొదటిసారి కాదు. 2017–2022 మధ్య సిటీలలో నివసిస్తున్న 1.22 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం వడ్డీ రాయితీ మంజూరు చేసింది.