V6 News

హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ చేసి కొత్త బైక్..ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ చేసి కొత్త బైక్..ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్

 ఉప్పల్, వెలుగు: ఈజీ మనీ కోసం మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్​లకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను సికింద్రాబాద్ టాస్క్​ఫోర్స్, ఓయూ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. అంబర్​పేటకు చెందిన ఫ్లవర్ డెకరేటర్ పులిపాటి హేమంత్ కుమార్, రామంతాపూర్​కు చెందిన పల్లె దీపక్ పాత నేరస్తులు. వీరిపై పలు పోలీస్​స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీరిద్దరితోపాటు రామంతాపూర్​కు చెందిన మరో ప్రైవేటు ఉద్యోగి మాల్​శంకరయ్య (20) కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఈ నెల 17న హబ్సిగూడలోని కరూర్ వైశ్యా బ్యాంక్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను టార్గెట్ చేశారు. హోండా యూనికార్న్ బైక్​పై వచ్చి ఆమె మెడలోని 35 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. 

అనంతరం ఆ గొలుసును మూడు ముక్కలు చేసి, భగత్​సింగ్​నగర్​కు చెందిన గోల్డ్​స్మిత్ రామాచారికి అమ్మారు. వచ్చిన డబ్బుతో ప్రధాన నిందితుడు హేమంత్ ఏకంగా ఒక కొత్త పల్సర్ బైక్​ను కొనుగోలు చేశాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి చోరీ చేసిన బంగారు గొలుసుతో పాటు దొంగతనానికి వాడిన యూనికార్న్ బైక్, కొత్తగా కొన్న పల్సర్ బైక్, సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.