హైదరాబాద్, వెలుగు: అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో కేసీఆర్ను మించినోళ్లు లేరని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసినోళ్లకు రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓ లెక్కనా? అని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం సిట్ విచారణకు ఆయన హాజరయ్యారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ 2023 జులైలో తన ఫోన్ ట్యాప్ చేశారని తెలిపారు. సిట్ అధికారులు చెప్పింది వింటే ప్రజలు ఆశ్చర్యపోతారని చెప్పారు. వేల ఫోన్లు ట్యాప్ చేసి.. ప్రైవేట్ సంభాషణలను విన్నారని తెలిపారు.
