సాఫ్ట్వేర్ ఇంజనీర్ శుభ శ్రీ మృతికి కారణమైన AIADMK నేత సి.జయగోపాల్ ను శుక్రవారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న సాయంత్రం తన ఆఫీస్ పనులు ముగించుకొని ఇంటికి బయల్దేరిన శుభశ్రీ ని ఫ్లెక్సీ రూపంలో మృత్యువు కబళించింది.
అన్నాడీఎంకే నాయకుడైన జయగోపాల్ తన కొడుకు వివాహ వేడుక సందర్భంగా పల్లికరణై రోడ్డులో దారిపొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అందులోని ఒక ఫ్లెక్సీ తెగి అదే సమయంలో అటుగా బైక్ పై వెళ్తున్న శుభశ్రీ పై పడింది. దాని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వెనుకనే వస్తున్న టాంకర్ లారీ ఆమెపై నుంచి వెళ్లి పోవడంతో శుభశ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన తర్వాత జయగోపాల్ పరారయ్యాడు. ఈ నెల 13 నుంచి పరారీలో ఉన్న అతడిని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణగిరి జిల్లాలోని దెంకాన్ కొట్టైలో తన బంధువుల ఇంట్లో తలదాచుకున్న జయగోపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకొని చెన్నైకి తీసుకువస్తున్నట్లుగా తెలిపారు. అతడిని రేపు చెన్నైలోని కోర్టులో హాజరుపరచనున్నారు.