చేప ప్రసాదం కోసం క్యూ.. 42 క్యూ లైన్ల ద్వారా పంపిణీ..

చేప ప్రసాదం కోసం క్యూ.. 42 క్యూ లైన్ల ద్వారా పంపిణీ..
  • నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​కు తరలివచ్చిన జనం
  • పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • నేడు ఉదయం 10 గంటల దాకా చేప ప్రసాదం

హైదరాబాద్ సిటీ, వెలుగు: చేప ప్రసాదం కోసం హైదరాబాద్​లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు ఆదివారం భారీగా జనం తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు బత్తిని కుటుంబసభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. చేప ప్రసాదం కోసం దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి కూడా జనం వస్తారన్నారు. బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదాన్ని అందజేస్తారని తెలిపారు. జనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 15 రోజుల నుంచి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రతి ఏడాది మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తారని తెలిపారు. ఆస్తమాతో ఇబ్బందిపడుతున్న వారు చేప ప్రసాదం తీసుకుంటే నయం అవుతుందని అందరూ విశ్వసిస్తారని అన్నారు.

ప్రజలకు మంచినీరు, టిఫిన్, మధ్యాహ్న భోజనం, మజ్జిగ పంపిణీ చేసిన పలు స్వచ్ఛంద సంస్థలను మంత్రి పొన్నం అభినందించారు. ‘‘మృగశిర కార్తె ప్రారంభమైంది. పుష్కలంగా వర్షాలు కురిసి రాష్ట్రంతో పాటు దేశమంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రభుత్వం తరఫున చేపలు పంపిణీ చేసినం’’అని పొన్నం తెలిపారు. చేప ప్రసాదం తీసుకుంటే అన్ని వ్యాధులు నయం అవుతాయని ప్రజల విశ్వాసమని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. ప్రతి ఏడాది తాను కూడా చేప ప్రసాదం తీసుకుంటానని తెలిపారు. ప్రజల్లో చేప ప్రసాదంపై ఎంతో నమ్మకం ఉందని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. విదేశాల నుంచి కూడా జనం రావడమే అందుకు నిదర్శమని తెలిపారు. బత్తిని కుటుంబ సభ్యులు చాలా ఏండ్ల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేప ప్రసాదం పంపిణీ చేయడం అభినందనీయమని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ తెలిపారు.

గుండెపోటుతో వృద్ధుడు మృతి
చేప ప్రసాదం కోసం వచ్చిన ఓ వృద్ధుడు గుండెపోటుతో చనిపోయాడు. మెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణ (75) చేప ప్రసాదం కోసం క్యూ లైన్​లో నిల్చున్నాడు. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికంగా ఉన్న హెల్త్ క్యాంప్​కు తరలించి సీపీఆర్ చేసి ఉస్మానియాకు తరలించారు. కానీ.. అతను అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

42 క్యూ లైన్ల ద్వారా పంపిణీ
42 క్యూ లైన్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీ చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 45,905 మందికి చేప ప్రసాదం పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. బత్తిని సోదరులతో పాటు వారి కుటుంబ సభ్యులు దాదాపు 250 మంది చేప ప్రసాదం అందజేశారు. సోమవారం ఉదయం 10 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని బత్తిని సోదరులు తెలిపారు.