ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ క్రాస్రోడ్లోని బావర్చి హోటల్లో ఓ కస్టమర్కు కోడి ఈకలతో ఉన్న బిర్యానీ పీస్లను వడ్డించడంతో కస్టమర్ అవాక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి ప్రభు అనే యువకుడు తన ఫ్రెండ్ తో కలిసి బిర్యానీ తినడానికి రెస్టారెంట్కు వెళ్లాడు. చికెన్ బిర్యానీ తినే సమయంలో అపరిశుభ్రంగా ఉన్న కోడి ఈకలతో కూడిన లెగ్ పీస్ వచ్చింది.
ఇదేమిటని సిబ్బందిని ప్రశ్నించగా.. దానికి బదులు వేరే పీస్ ఇస్తామని నిర్వాహకులు సమాధానమిచ్చారు. దీంతో ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియక బిల్ అమౌంట్ కట్టి అక్కడి నుంచి యువకుడు వెళ్లిపోయాడు. గతంలో కార్పొరేటర్ రవి చారికి, అంబర్పేట వాసికి ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి రావడంతో రెస్టారెంట్ ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు, ఇతరులు ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఇన్ని జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.