- నెల క్రితం రూ.260..
- రెండు వారాలుగా తగ్గుముఖం
- కోళ్ల ఉత్పత్తి పెరగడమే
- కారణమంటున్న వ్యాపారులు
హైదరాబాద్, వెలుగు: చికెన్ రేట్లు భారీగా దిగొస్తున్నాయి. నెల కింద రూ.260 ఉన్న చికెన్ తగ్గుతూ వస్తోంది. రెండు వారాల కింద రూ.230కి చేరింది. ఆదివారం నాటికి కిలో రూ.160కి పడిపోయింది. దీంతో కొనుగోళ్లు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. సాధారణంగా వేసవిలో ఎండలకు కోళ్లు మృతి చెంది చికెన్ కొరత ఏర్పడుతుంది. దీంతో ధరలు పెరుగుతాయి. చలికాలంలో ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ధరలు కాస్త తక్కువగానే ఉంటాయి.
గత నెలలో కార్తీక మాసం కావడంతో కొందరు చికెన్మానేశారు. నిజానికి ఆ టైమ్లో తగ్గాలి. కానీ రేటు స్థిరంగా కొనసాగింది. కార్తీక మాసం తర్వాత చికెన్ రేట్లు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా తగ్గాయి. కార్తీక మాసం టైమ్లో డిమాండ్కు అనుగుణంగా కోళ్లఫామ్ రైతులు పెంపకం చేపట్టడం వల్ల పెద్దగా రేట్లు తగ్గలేదని, ఆ తర్వాత డిమాండ్కు మించి ఉత్పత్తిని భారీగా పెంచడంతో కొనుగోళ్లు పెరిగినా రేట్లు దిగొచ్చాయని అంటున్నారు. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కిలో చికెన్రూ.120కి అమ్ముతున్నట్టు వ్యాపారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజూ 3.5 లక్షల కేజీల చికెన్ వినియోగం అవుతుండగా, ఇటీవల డిసెంబరు 31న 4.5 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరిగినట్టు చెప్పారు.