- పన్ను ఎగ్గొ ట్టేందుకు ఇండ్లు కొనిస్తున్న తల్లిదండ్రులు
- చిన్నవయసులోనే కోటీశ్వరులు
ఐదేళ్ల నుంచి వరుసగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలుస్తున్న సింగపూర్లో ఇల్లు కొనాలంటే.. కోట్లు కుమ్మరించాల్సిందే. కానీ.. సింగపూర్ పిల్లలకు భలే చాన్స్ దొరికింది. పట్టుమని 20 ఏళ్లు నిండకుండానే.. ఖరీదైన ఇండ్లను సొంతం చేసుకుంటున్నారు. అబ్బో.. చిన్న వయసులోనే ఇండ్లను కొంటున్నారంటే.. బాగానే సంపాదిస్తున్నారని అనుకుంటున్నారా? అదేంలేదు.. తల్లిదండ్రులే వాళ్ల పేరు మీద ఇండ్లను కొనేస్తున్నారు. సింగపూర్ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రూల్సే దీనికి కారణం. కొన్ని ప్రాంతాల్లో ఒక అపార్ట్మెంట్ పెంట్హౌస్ రేటు సుమారుగా రూ. 6 కోట్లకు పైనే పలుకుతోంది. దీన్ని నియంత్రించాలని భావించిన సింగపూర్ ఇటీవల కొన్ని కొత్త రూల్స్ పెట్టింది. రెండో ఇల్లు కొంటే అదనపు స్టాంప్ డ్యూటీ కింద 12 % పన్ను కట్టాల్సిందే. మూడో ఇల్లు కావాలంటే 15% పన్ను. అంటే.. ఒకరకంగా ఇది సంపన్నులపై విధించే ట్యాక్స్అన్నమాట. సింగపూర్లో సంపన్నవర్గాల ప్రజలు ఎన్ని ఆస్తులను పోగేసుకుంటే అంత గొప్పగా భావిస్తున్నారట. అందుకే నచ్చిన ప్రాపర్టీలన్నీ కొనేస్తున్నారట. కానీ.. ఇప్పుడు ట్యాక్స్అడ్డంకి కావడంతో వారి చూపు పిల్లలపై పడింది. మొదటిసారి ఇల్లు కొనేవారికి ఏబీఎస్డీ ఉండదు కాబట్టి.. వారి పిల్లల పేరుతో ఇండ్లు కొంటున్నారట. బిడ్డలు మైనర్లు అయితే, ట్రస్టు అకౌంట్లు ఓపెన్చేసి మరీ ఇండ్లు కొనేస్తున్నారట. దీంతో ఆ ప్రాపర్టీ మీద సర్వ హక్కులూ పిల్లలకే దక్కుతున్నాయి.