ఇంటి నుంచి పారిపోయిన సూర్యాపేట చిన్నారులు

ఇంటి నుంచి పారిపోయిన సూర్యాపేట చిన్నారులు
  • మేనమామకు అప్పగించిన అమ్రాబాద్​ పోలీసులు

అమ్రాబాద్, వెలుగు: ఇంటి నుంచి పారిపోయిన చిన్నారులను నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్  పోలీసులు వారి మేనమామకు అప్పగించారు.  ఎస్ఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం..  సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం గుడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన తులసీరాం, మంగమ్మకు కవల పిల్లలు కాగా, వారు విడిపోవడంతో అనాథలుగా మారారు.  చిన్నారులను అదే గ్రామంలో ఉండే మేనమామ ఆంజనేయులు చేరదీశాడు. 

వారిని చదువుకోమని మందలించడంతో పిల్లలిద్దరూ ఈ నెల11న ఇంటి నుంచి పారిపోయారు. బస్సులో శనివారం అచ్చంపేటకు చేరుకున్న చిన్నారులు, ఆదివారం మద్దిమడుగు ఫస్ట్  బస్  ఎక్కగా, అనుమానం వచ్చిన కండక్టర్  వారిని ప్రశ్నించి పోలీసులకు సమాచారమిచ్చారు.  ఎస్ఐ వీరబాబు వారిని స్టేషన్ కు తీసుకెళ్లి వివరాలు తెలుసుకున్నారు. మేనమామ ఆంజనేయులును పిలిచి అప్పగించారు.