మిర్చి ధర ఆల్ టైం రికార్డును సృష్టించింది. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో దేశీ మిర్చి ధర ఏకంగా రూ. 90 వేలు పలికింది. మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబత్ పల్లికి చెందిన అశోక్ అనే రైతు..తాను పండించిన మిర్చిన మార్కెట్కు తీసుకొచ్చాడు. ఈ మిర్చిని మాధవి ట్రేడర్స్కు విక్రయించగా...లక్ష్మీ సాయి ట్రేడర్స్ క్వింటాల్కు రూ.90 వేలు వెచ్చించి కోనుగోలు చేసింది. ఆశోక్ తీసుకొచ్చిన మిర్చిలో ఒక్క బస్తాకు మాత్రమే రూ. 90 వేలు పలికింది. మిగతా బస్తాలకు మాత్రం సాధారణ ధరలే చెల్లించారు. క్వింటాల్ మిర్చికి రూ. 90 వేలు పలకడంపై రైతు ఆశోక్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
గత రికార్డు బద్దలు..
ఈ ఏడాది మిర్చి ధర అత్యధక మొత్తానికి అమ్ముడైంది. జులైలో వరంగల్ ఎనుమాముల మార్కెట్లో వండర్ హాట్ రకం మిర్చికి.. క్వింటాల్కు రూ. 32,500 ధర పలికింది. సెప్టెంబర్లో అత్యధికంగా రూ. 35,500కు విక్రయించారు. తాజాగా ఈ రికార్డు బద్దలైంది. మిర్చికి రికార్డు ధర పలకడంతో..అన్నదాతలు మార్కెట్కు క్యూ కడుతున్నారు. అకాల వర్షాలు, తెగుళ్లతో నష్టపోయిన రైతులకు..రికార్డు ధర కొత్త ఊరటనిస్తోంది.