
ప్రస్తుతం భారత్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఈ క్రమంలో చైనాతో రక్షణ, వాణిజ్య పరంగా కూడా భారత్ మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది. అయితే చైనా ప్రవర్తన మాత్రం భారత ఆర్థిక వ్యవస్థ వ-ృద్ధిని నెమ్మదింపజేసేది ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో చైనా భారతదేశానికి ఎగుమతులను కావాలని ఆలస్యం చేస్తూ వస్తోంది. టెక్నికల్ కారణాలతో పాటు ఎగుమతులకు పోర్టుల్లో ఆలస్యాలతో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రేర్ ఎర్త్ మెటీరియల్స్, టన్నెల్ బోరింగ్, వ్యవసాయంలో అవసరమైన ఫెర్టిలైజర్స్, పరిశ్రమలకు అవసరమైన మెషినరీ వంటి అనేక వస్తువుల ఎగుమతులను అడ్డుకుంటోంది. ఇవి ఎలక్ట్రానిక్స్, ఈవీ, విండ్ టర్బైన్, రైల్వే వంటి కీలక రంగాలకు చాలా ముఖ్యమైనవిగా తెలుస్తోంది.
టెక్ తయారీ కేంద్రంగా మారాలని భావిస్తున్న ఇండియా కలలను చిదిమేసేందుకు చైనా ఈ కుట్రలకు పాల్పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కోసం ప్రోత్సాహకాలను ఇవ్వటంతో పెరుగుతున్న ఆసక్తిని అడ్డుకోవాలని చూస్తోంది చైనా. ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత కీలకంగా మారినవేళ వ్యవసాయ రంగానికి అవసరమైన ఫెర్టిలైజర్ ఉత్పత్తులను అడ్డుకుంటోంది. కొన్ని చైనా సంస్థలు భారత కంపెనీలతో వ్యాపారం చేసేందుకు కూడా నిరాకరిస్తున్నాయంటే అక్కడి ప్రభుత్వం ఏ స్థాయిలో కుట్రలు చేస్తుందో అర్థమౌతోంది.
వాస్తవానికి గల్వాన్ ఘర్షణ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో చైనా ప్రమేయాన్ని మోదీ సర్కార్ తగ్గిస్తూ వస్తోంది. ఈ క్రమంలో చైనా కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టడాన్ని కఠినంగా వ్యవహరించటంతో పాటు చైనా యాప్స్ భారీగా తొలగింపు వంటి చర్యలు చేపట్టింది. అయితే ప్రస్తుతం ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ ఇక్కడ గ్రోత్ అడ్డుకునేందుకు చైనా ఈ తరహా కుట్రలకు తెరలేపిందని నిపుణులు చెబుతున్నారు. పైకి భారతదేశంతో స్నేహంగా మెలుగుతూ వెనుక నుంచి ఆర్థిక వ్యవస్థను కూల్చేసేందుకు కుయుక్తులు పన్నుతోందని వారు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి సమయంలో భారత్ చైనాకు ప్రత్యామ్నాయంగా కీలక వస్తువులు, మెషినరీ సోర్సింగ్ కోసం రష్యా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా వంటి దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇక్కడ చైనా వస్తువులు నాణ్యత పరంగా తక్కువగా ఉండటంతో ఇతర దేశాల నుంచి దిగుమతులు ఆలస్యం కావటం కీలక ప్రాజెక్టులను దెబ్బతీస్తోంది. చైనాతో భారత్ సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తుండగా చైనా మాత్రం వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చుకుని భారత్ పై ఒత్తిడిని పెంచాలని చూస్తోంది.