
- చింతల్ బస్తీ పీహెచ్సీని విజిట్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: మెరుగైన వైద్యం అందించి, సర్కారు దవాఖానలపై ప్రజలకు నమ్మకం కలిగించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం చింతల్ బస్తీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , యునాని దవాఖానను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్ తో పాటు మెడికల్ స్టోర్ లో మందుల నిల్వ, క్యాడర్ స్ట్రెంత్, డాక్టర్ల పనితీరుపై పబ్లిక్ హెల్త్ నర్స్ శకుంతలను అడిగి తెలుసుకున్నారు.
వర్షాకాలం మొదలైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విధులకు గైర్హాజరైన ఏఎన్ఎంలపై చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఫీల్డ్లో ఉన్న ఏఎన్ఎం లకు ఫోన్ చేసి ఎక్కడున్నారని, ఎక్కడ వైద్య సేవలందిస్తున్నారో కనుక్కున్నారు. అక్కడ ఇంటి యజమానితో మాట్లాడించాలని కోరి మాట్లాడారు.
వైద్య సేవలు సరిగా అంతుతున్నాయా లేదా అని మందులు సరిగ్గా ఇస్తున్నారా లేదా .. ఏఎన్ఎంలు ఎలా పని చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే స్థానిక అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. ప్రతివారం స్కూల్స్, దవాఖానలు, హాస్టల్స్ ను కలెక్టర్, బల్దియా కమిషనర్, తాను ఆకస్మికంగా తనిఖీలు చేస్తామని, శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. కార్పొరేటర్ విజయారెడ్డి, డాక్టర్లు పాల్గొన్నారు.