యాదాద్రి జిల్లాలో 17 మంది మిల్లర్లకు నోటీసులు

యాదాద్రి జిల్లాలో 17 మంది మిల్లర్లకు నోటీసులు
  • వడ్లు దించుకోనందుకు మిల్లర్లకు జారీ చేసిన సివిల్​ సప్లయ్ అధికారులు  
  • వారంలో రిప్లై ఇవ్వాలని ఆర్డర్స్​
  • నెక్స్ట్ సీజన్​లో  వడ్లు కేటాయించబోమని వార్నింగ్  

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో కొనుగోలు కేంద్రాల నుంచి లారీల్లో లోడ్ గా వెళ్లిన వడ్లను దించుకోకుండా ఇబ్బందులు పెడుతున్న మిల్లర్లకు సివిల్​సప్లయ్​డిపార్ట్​మెంట్​నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న మిల్లర్లలో జిల్లా రైస్​మిల్లర్ల సంఘం అధ్యక్షుడు మార్త వెంకటేశ్​ సహా 17 మంది ఉన్నారు. ఈ యాసంగి సీజన్​లో 4.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని సివిల్​సప్లయ్​డిపార్ట్​మెంట్​టార్గెట్​గా నిర్ణయించుకుంది. 39 మిల్లులకు వాటి కేపాసిటీకి అనుగుణంగా సీఎంఆర్​కోసం వడ్లు ఇవ్వాలి. అయితే ఇప్పటివరకు 3.30 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసింది. 

కొందరు మిల్లర్లు తమ మిల్లుల కెపాసిటీకి అనుగుణంగా నిర్దేశించిన కోటా వడ్లను దించుకోవడం లేదు. దీంతో టార్గెట్​చేరుకోవడంలో సివిల్​సప్లయ్​ డిపార్ట్​మెంట్ ఇబ్బందులు పడుతోంది. దీంతో ఆఫీసర్లు పలుమార్లు హెచ్చరించినా మిల్లర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజాపేటకు చెందిన మణికంఠ రైస్​మిల్లుకు 1.40 లక్షల క్వింటాళ్ల వడ్లు దించుకోవాలని టార్గెట్ పెడితే.. కేవలం 41 వేల క్వింటాళ్లు మాత్రమే తీసుకున్నారు. 

అదేవిధంగా చౌటుప్పల్​కు చెందిన మల్లికార్జున రైస్​ మిల్లుకు 1.40 లక్షల టన్నులు లక్ష్యం ఇవ్వగా..  60 వేల టన్నులు మాత్రమే దించుకున్నారు. ఇలా 17 మంది మిల్లర్లు వడ్లు దించుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వడ్ల కొనుగోళ్లలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఆయా మిల్లులకు అడిషనల్​ కలెక్టర్​వీరారెడ్డి నోటీసులు జారీ చేశారు. వడ్లు దించుకోనందుకు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. స్పందించని మిల్లర్లకు వచ్చే సీజన్​ నుంచి సీఎంఆర్ ​కోసం వడ్లు ఇవ్వమని ఆయన హెచ్చరించారు.