పైసల లొల్లి తండ్రీకొడుకుల ప్రాణాలు తీసింది

పైసల లొల్లి తండ్రీకొడుకుల ప్రాణాలు తీసింది

లింగంపేట, వెలుగు : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్దగుజ్జుల్​ తండాలో మద్యం మత్తులో కొడుకును కత్తితో పొడిచిన ఓ తండ్రి తర్వాత గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండావాసులు, పోలీసుల కథనం ప్రకారం..తండాకు చెందిన బదావత్​వసంత్​రావు(45)కు సరస్వతి, నీల భార్యలు. వీరిలో చిన్న భార్య నీల చనిపోయింది. పెద్ద భార్య సరస్వతి కొడుకు సురేశ్​(22)కొన్నేండ్ల కింద దుబాయ్ ​వెళ్లాడు. అక్కడ సంపాదించిన డబ్బును ప్రతి నెలా తండ్రికి పంపేవాడు. నెల కింద దుబాయ్​నుంచి వచ్చిన సురేశ్ కొద్ది రోజులుగా తాను పంపిన డబ్బుల గురించి అడుగుతున్నాడు. 

దీనికి వసంత్​రావు రేపు మాపు ఇస్తా అంటూ కాలయాపన చేస్తున్నాడు. బుధవారం రాత్రి డబ్బుల విషయంలో తండ్రితో సురేశ్ ​గొడవపడ్డాడు. ఖచ్చితంగా డబ్బులు కావాలని పట్టుబట్టడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న తండ్రి క్షణికావేశంలో ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి పొడిచాడు. సురేశ్​అక్కడికక్కడే చనిపోయాడు. కొద్దిసేపటికే వసంత్​రావు గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తండావాసులు పోలీసులకు సమాచారమివ్వగా ఎస్ఐ ప్రేమ్​దీప్​ సిబ్బందితో వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న వసంత్​రావును నిజామాబాద్​ హాస్పిటల్​కు తరలించారు. అక్కడే ట్రీట్​మెంట్​తీసుకుంటూ గురువారం చనిపోయాడు. వసంత్​రావు భార్య సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు సీఐ రామన్ తెలిపారు.