జనగామ, వెలుగు : బీడీలు చుట్టిన ఇంటి నుంచి వచ్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రశ్నించారు. శనివారం జనగామ డీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్పై సభ్యత, సంస్కారం లేకుండా వ్యక్తిగతంగా చేసిన కామెంట్లను ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాంగ్రెస్పైనే విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. తాము కూడా వ్యక్తిగతంగా మాట్లాడితే మీ పార్టీ నాయకులు రోడ్ల మీద తిరగలేరన్నారు. బీసీలకు ద్రోహం చేసిన మల్లన్నకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కాంగ్రెస్కారణంగా ఎమ్మెల్సీగా గెలిచిన మల్లన్న.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
'నీ పార్టీ బీ ఫాంపై పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకుంటే.. నేను ఆలేరులో పోటీ చేయను' అని సవాల్ చేశారు. అంతకుముందు జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు.
‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యంతో జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారుల గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని అయిలయ్య అన్నారు. జిల్లాకు 1,87,214 కార్డులు వచ్చాయని, 15 రోజుల్లో పంపిణీ చేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో మీ-సేవా కేంద్రాన్ని ప్రారంభించి, ‘ఇండిపెండెన్స్ గార్డెన్’కు శ్రీకారం చుట్టారు.
