
అమరావతి: ఇవాళ సీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దైంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరగడంతో పర్యటనను రద్దు చేసుకున్నట్లు సీఎంవో అధికారులు తెలిపారు. ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు చెప్పారు.
వరుసగా రెండో ఏడాది శ్రీశైలంలోకి వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా పలు ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు ఇవాళ జగన్ శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గత రాత్రి అగ్నిప్రమాదం జరిగిన విషయాన్ని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. జలవిద్యుత్ కేంద్రంలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీఎంకు వివరించారు. ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించండం, సమీక్షా సమావేశాలు నిర్వహించడం కరెక్ట్ కాదని సీఎం అధికారులతో అన్నారు. ప్రమాదంలో చిక్కుకుపోయిన వారు సురక్షితంగా బయటపడాలని జగన్ ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వం నుంచి, యంత్రాంగం నుంచి ఎలాంటి సహాయం కోరినా వెంటనే వారికి అందించాలని ఆదేశాలు జారీచేశారు.
see more news