
ఉద్యోగాల కోసం కొన్ని వర్గాల వారు ఎస్సీల్లో చేరుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. తమను ఎస్సీల్లో చేర్చాలంటూ తనకు రోజూ అప్లికేషన్స్ ఇస్తుంటారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ ఎందుకు మనకు దళిత సమాజం, గిరిజన సమాజం, బలహీన వర్గాల్లో ఉన్న నిరుపేదలు.. కొందరు అప్పర్ క్లాసులో ఉన్నటువంటి దళితులు ఎందుకు ఏడుస్తూ ఉండాలె. ఎందుకీ మూగరోదన.. ఎందుకీ వేదన, ఎందుకు వింటున్నం. ఒక రకమైనటువంటి అసంతృప్తి.. ఎవరెదురైనా ఇదే మాట్లాడుతారు. నాకు రోజూ దరఖాస్తులొస్తా ఉంటయ్. సార్ మేం రజకులం..మమ్మల్ని ఎస్సీల కలపాలె అంటారు. ఉన్నోళ్లంతా ఎస్సీల్లో కలిపితే వాళ్లెటు పోవాలె మరి. బీసీల్లో ఉండే ప్రజలు కూడా ఎస్సీల్లో చేర్చండంటూ అప్లికేషన్స్ వస్తుంటయ్. ఎందుకీ పరంపర, ఎస్సీల్లో కలిపితే రెండు ఉద్యోగాలు వస్తయేమో. ఏదైనా అవకాశం కలిసొస్తదేమో అనే ఒక ఆర్తి, ఒక లేమి, బాధ. ఈ విషయంలో ప్రజలను తప్పుబట్టడానికి మనకు అధికారం లేదు. జ్ఞానం ఎక్కడ దొరికితే అక్కడ సంపాదించుకోవాలె. మనకు తెలియని దానిని తెల్వదని నిర్భయంగా చెప్పి తెలుసుకోవాలె. దేశంలో ఎవరూ హ్యాపీగా లేరు. రైతులంతా రాజధానిలో 13 నెలలు ధర్నా చేశారు. వందల మంది చనిపోతే కనీసం సానుభూతి కూడా తెలపలేదు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.