హైదరాబాద్: తెలంగాణలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది. LPG గ్యాస్ సిలిండర్ల సప్లై విషయంలో హోటల్స్పై విధించిన ఆంక్షలను తగ్గించాలని, హోటల్స్ను కూడా అత్యవసర సేవలు అందించే సంస్థలుగా గుర్తించాలని హోటల్స్ అసోసియేషన్ లేఖలో విజ్ఞప్తి చేసింది.
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సప్లైపై విధించిన ఆంక్షల వల్ల హోటల్స్, రెస్టారెంట్స్ మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందని.. ఈ పరిణామంతో ఎంతో మంది ఉపాధి కోల్పోతున్నారని.. ప్రజలకు అందించే ఫుడ్ సర్వీస్కు అంతరాయం కలుగుతుందని హోటల్స్ అసోసియేషన్ లేఖలో గుర్తుచేసింది. వేల మంది వర్కర్లు, ఉద్యోగులు, విద్యార్థులు, వలస కార్మికులు.. హోటల్స్ మూసివేస్తే ఇబ్బందుల్లో పడతారని తెలిపింది.
గ్యాస్ దిగుమతుల్లో ఏర్పడిన అంతరాయాలతో గృహ వినియోగదారులకు మాత్రమే ఎల్పీజీ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. కమర్షియల్ సిలిండర్లతో పాటు ఇండస్ట్రియల్, ఆటోమొబైల్ రంగాల్లో ఎల్పీజీ వాడకంపై తాత్కాలిక పరిమితులు విధించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.
►ALSO READ | డాక్టర్ నమ్రత రూ.29.76 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
ఒక్క హైదరాబాద్లోనే నెలకు 6 నుంచి 6.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు విక్రయాలు జరుగుతాయి. టీ స్టాల్లు నుంచి స్టార్ హోటళ్ల వరకు నెలకు 4 నుంచి 5.50 లక్షల సిలిండర్లకు అవసరం ఉంటుంది. ఇండస్ట్రీలకు మరో 1.50 లక్షలు అదనంగా డిమాండ్ ఉంది. ఈ మొత్తం కమర్షియల్ సేల్స్ విలువ నెలకు రూ.140 నుంచి రూ.150 కోట్లకు చేరుతుందని గ్యాస్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. బల్క్ ట్యాంకర్ల సరఫరా ఆగిపోయింది.
