
మహబూబాబాద్, వెలుగు: మానుకోట టీఆర్ఎస్ లో వర్గపోరు బహిర్గతమైంది. ఈ నెల చివరలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసం సీఎం కేసీఆర్ రానుండడంతో ఆదివారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇతర నేతలతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ఆఫీస్వద్దకు చేరుకున్న సమయంలో మానుకోట టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పరిశీలన సమయంలో తాను ఎంతో రిస్కు తీసుకుని ఆఫీస్ నిర్మాణం కోసం కృషి చేశానని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనడంతో అక్కడే ఉన్న ఎంపీ కవిత రియాక్ట్ అయ్యారు. ఆఫీస్ నిర్మాణ బాధ్యతలు మొత్తం పార్టీనే చూసుకుందని, అందులో మీరు చేసింది ఏముందని అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఇద్దరు మంత్రులు వారికి సర్ది చెప్పారు. గతంలో జిల్లా కేంద్రంలో రైతు దీక్ష సమయంలో ఎంపీ కవిత దగ్గరి నుంచి ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కున్నారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి.
నోరు జారిన ఎర్రబెల్లి..
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ టంగ్ స్లిప్ అయ్యారు. టీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి బదులుగా టీడీపీ ఆఫీస్ ప్రారంభోత్సవం అని పలకడంతో పక్కనే ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ సరిచేశారు.