
8వ నిజాం ముకరం ఝా పార్థీవదేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఆయన భార్య, కుటుంబ సభ్యులను ఓదార్చారు. రేపు(బుధవారం) అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని వారితో సీఎం చెప్పారు. డీజీపీ అంజనీకుమార్ సైతం ముకరం ఝాకు నివాళులర్పించారు.
టర్కీలో కన్నుమూసిన 8వ నిజాం ముకరం ఝా భౌతికకాయం హైదరాబాద్ చేరుకుంది. చార్టెడ్ ఫ్లైట్ లో రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న భౌతికకాయాన్ని అక్కడి నుంచి నేరుగా చౌమహల్లా ప్యాలెస్ కు తరలించారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్ లోకి జనాన్ని అనుమతించనున్నారు. సాయంత్రం 4 గంటలకు భౌతికకాయాన్ని చౌమహల్లా ప్యాలెస్ నుంచి మక్కా మసీదుకు తీసుకెళ్లనున్నారు. అక్కడ ప్రార్థనలు నిర్వహించిన అనంతరం సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.