
కేసీఆర్పై బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ విమర్శలు
హైదరాబాద్, వెలుగు: రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ యాగాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు విమర్శించారు. యాగాలు, పూజలకు బీజేపీ వ్యతిరేకం కాదని, కేసీఆర్ సొంత ఖర్చులతో యాగాలు చేస్తే తమకు అభ్యంతరంలేదని అన్నారు. యాగాలకు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించొద్దన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కేసీఆర్కు బుద్ధి రాలేదని విమర్శించారు. అక్బరుద్దీన్పై కేసు నమోదు చేయాలని కోర్టు చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అక్బరుద్దీన్ ఒవైసీని కేసీఆర్ కాపాడుతున్నారని ఆరోపించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి హిందువుల మనోభావాలను కేసీఆర్ కించపరుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ఆవేశంతో బీజేపీని విమర్శిస్తున్నారని అన్నారు. కరీంనగర్లో అక్బరుద్దీన్ ప్రసంగాన్ని ఖండించే ధైర్యం కూడా పొన్నం ప్రభాకర్కు లేదని దుయ్యబట్టారు. బీజేపీ బలం ఏంటో కరీంనగర్ ప్రజలు పొన్నంకు చూపించారని చురకలంటించారు. ‘గాంధీ భవన్ ఫర్ సేల్’ అని కాంగ్రెస్ నేతలు బోర్డు పెట్టుకోవాలని కృష్ణసాగర్రావు ఎద్దేవా చేశారు.