కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయ్యింది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కొత్త సెక్రటేరియట్ ను ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటన రిలీజ్ చేశారు.
అయితే సెక్రటేరియట్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రతి వారం పనులు పరిశీలించినా పనులు ఆలస్యం అవుతున్నాయి. ఫిబ్రవరి 17 లోగా నిర్మాణ పనులు పూర్తయితే మొత్తం భవనాన్ని లేకుంటే.. సీఎం, సీఎస్ ఛాంబర్లు పూర్తి చేసి ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే సెక్రటేరియట్ ప్రారంభించాల్సింది కానీ పనులు కాకపోవడంతో ఆలస్యం అయ్యింది. దీంతో పనులు పూర్తయినా కాకున్నా.. ఫిబ్రవరి 17న కేసీఆర్ ప్రారంభించనున్నారు. కొత్త సెక్రటేరియట్ కు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
రూ. 400 కోట్ల నుంచి మొదలు..!
ఆరు ఫ్లోర్లు.. ఆరు లక్షల చదరపు అడుగుల్లో సెక్రటేరియెట్ నిర్మాణానికి రూ.400 కోట్లు అవుతుందని తొలుత లెక్కలు కట్టి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత టెండర్లప్పుడు అది కాస్తా రూ. రూ. 494 కోట్లకు చేరింది. షాపూర్జీ పల్లోంజీ 4 శాతం ఎక్కువగా రూ. 514 కోట్లు కోట్ చేసి టెండర్ ప్రక్రియలో ఎల్-1 గా నిలిచింది. కొద్ది రోజులకే ఈ అంచనాలను పెంచారు. ఒక ఫ్లోర్ పెరిగిందని, ఇంకో లక్ష చదరపు అడుగులకు అంచనా వ్యయం రూ. 219 కోట్లు అవుతుందంటూ మొత్తం కాస్ట్ రూ.619 కోట్లకు చేర్చారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఆ తర్వాత ధరలు పెరిగినందున నిర్మాణ ఖర్చు రూ.800 కోట్లు అవుతుందన్నారు. అది మళ్లీ రూ.వెయ్యి కోట్లకు చేరింది. ఇట్లా పనులు పూర్తయ్యే నాటికి ఖర్చు రూ.1,200 కోట్లు చేరుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు.