సింగరేణి వేలం ఆపాలంటూ మోడీకి కేసీఆర్ లేఖ

సింగరేణి వేలం ఆపాలంటూ మోడీకి కేసీఆర్ లేఖ
  • తెలంగాణ బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం 
  • ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్​ లెటర్

హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తలపెట్టిన 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని వెంటనే ఆపేయాలని సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుంచి మూడు రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ఈ మేరకు మోడీకి లెటర్​ రాసినట్టు సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.

ఏటా 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్ల అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తున్నదని సీఎం గుర్తు చేశారు. ‘రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కరెంటు డిమాండ్ జూన్ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా, 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగినందున కరెంటు తయారీకి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం కీలకం. సింగరేణిలో బొగ్గు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మైనింగ్ లీజులకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపింది.

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ట్రాంచ్ 13 కింద వేలం వేయదలిచిన జేబీఆర్​వోసీ-3, శ్రావణ్​  పల్లి ఓసీ, కోయగూడెం ఓసీ-3, కేకే-6 యూజీ బ్లాక్ ల వేలం వల్ల సింగరేణి పరిధిలోని బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాటి వేలాన్ని నిలిపివేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను  ఆదేశించాలని’ మోడీని కోరారు.