
- లోకల్బాడీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు మొదలు గెలుపుదాకా రెస్పాన్సిబిలిటీ
- జూమ్ మీటింగ్లో ఇన్చార్జి మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఈ నెల 5 కల్లా జడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలను సిద్ధం చేయండి
- స్థానిక లీడర్లతో సంప్రదింపులు జరిపి అర్హుల పేర్లు పంపండి
- ఇన్చార్జి మంత్రులకు స్థానిక లీడర్లు పూర్తిస్థాయిలో సహకరించాలి
- అన్ని జడ్పీలు, మెజార్టీ ఎంపీపీలను కైవసం చేసుకునేలా పనిచేయాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యత జిల్లా ఇన్చార్జి మంత్రులదేనని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అధికార పార్టీని గెలుపు తీరాలకు చేర్చాల్సిన బాధ్యతను ఆయా ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి మంత్రులకు అప్పగించారు. ఈ నెల 5 కల్లా జడ్సీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. మంగళవారం పీసీసీ చీఫ్మహేశ్గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఇన్చార్జి మంత్రులతో జూమ్లో మీటింగ్ నిర్వహించారు. లోకల్బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై వ్యూహరచన చేశారు. ఆయా జిల్లాల పరిధిలో జడ్పీటీసీ టికెట్ల ఖరారు నుంచి మొదలుకొని జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునే వరకు ఇన్చార్జి మంత్రే కర్త, కర్మ, క్రియగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
వీరికి అక్కడి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాలని అన్నారు. ఒక్కో స్థానంనుంచి ముగ్గురి పేర్లు పంపండి ప్రతి జడ్పీటీసీ స్థానం నుంచి ముగ్గురు అర్హులైన అభ్యర్థుల పేర్లను సూచిస్తూ పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్కు ప్రతిపాదనలను పంపించాలని ఇన్చార్జి మంత్రులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. అభ్యర్థుల ఎంపికలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగొద్దని, పార్టీ గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని తెలిపారు. మంత్రులు వెంటనే రంగలోకి దిగి పార్టీ నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకూంటూ పార్టీ గెలుపునకు రూట్ క్లియర్ చేసుకోవాలని ఆదేశించారు. ఆయా జిల్లాల మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సంప్రదింపులు జరిపి.. జడ్పీటీసీ అభ్యర్థిని ఎంపిక చేయాలని సూచించారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి
ప్రజాపాలనలో అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయిలో జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేయాలని ఇన్చార్జి మంత్రులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. 42 శాతం రిజర్వేషన్ అమలు విషయంలో ఇటు పార్టీ.. అటు ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధిని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని అన్నారు. అదే సమయంలో రిజర్వేషన్లను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను కూడా ప్రజలకు వివరించాలని రేవంత్ సూచించారు. మెజార్టీ జడ్పీ చైర్మన్లతోపాటు మండల పరిషత్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునేలా ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, డీసీసీ చీఫ్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఇన్చార్జి మంత్రులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్లకు లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలని, ఇది మిగిలిన కేడర్కు ఒక మంచి సంకేతం ఇచ్చినట్లు అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను, గత పదేండ్లుగా తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు చూపుతున్న వివక్షను కూడా జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు బీజేపీ, బీఆర్ఎస్ ఎక్కడా కూడా పోటీ కాదని, ఆ రెండు పార్టీలకు ప్రజలు ఈ ఎన్నికల ద్వారా మరోసారి తగిన గుణపాఠం చెప్పనున్నారని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.