బడాయి బడ్జెట్ వద్దు ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెబుదాం: సీఎం రేవంత్ రెడ్డి

బడాయి బడ్జెట్ వద్దు ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెబుదాం: సీఎం రేవంత్ రెడ్డి
  • ఆర్భాటాలకు పోవద్దు.. దుబారా ఖర్చులు వద్దు  
  • ప్రజల కోణంలో బడ్జెట్ ఉండాలె  
  • ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం ఆదేశం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మనముందున్న సవాళ్లు, లక్ష్యాలపై ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పేద్దామని అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకుని బడ్జెట్ తయారు చేయాలని సూచించారు. దుబారా, వృథా ఖర్చులు తగ్గించాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024–25) సంబంధించిన బడ్జెట్ రాష్ట్ర ఆదాయ, వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా తయారు చేయాలని సూచించారు. బుధవారం సెక్రటేరియెట్ లో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘‘రాష్ట్ర ఆదాయమెంత.. ఖర్చెంత? మనమిచ్చిన హామీలకు, చేయాల్సిన పనులకు ఎంత ఖర్చవుతుంది? అని పక్కాగా అంచనాలు రూపొందించాలి. అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నెలసరి ఖర్చులన్నింటిపై స్పష్టత ఉండాలి. ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖచిత్రం ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలి. ఎవరో కొందరు వ్యక్తులను సంతృప్తిపరిచే పని లేదు. ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే ప్రజల కోణంలో బడ్జెట్ ఉండాలి. లేనిపోని గొప్పలు, ఆర్భాటాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ ను రూపొందించాలి” అని అధికారులకు రేవంత్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను వందశాతం సద్వినియోగం చేసుకోవాలన్నారు.  

దుబారా ఖర్చులొద్దు.. 

అనవసర ఖర్చులు, దుబారా లేకుండా చూడాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. తప్పనిసరైతే తప్ప ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రకటనలు తగ్గించాలని.. కొత్త వాహనాలు కొనుగోలు చేయకుండా, ఇప్పుడున్న వాహనాలనే వినియోగించుకోవాలని సూచించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని గ్రాంట్లను రాబట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. వివిధ శాఖలు, స్కీముల వారీగా కేంద్రం అందించే మ్యాచింగ్ గ్రాంట్లను వందశాతం సద్వినియోగం చేసుకోవాలి. కొంతమేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందనో లేదా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా పేరు వచ్చేది లేదనో  బేషజాలకు పోవద్దు. తెలంగాణ అభివృద్ధి, ఇక్కడి ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా బడ్జెట్ ఉండాలి’’ అని రేవంత్​ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆర్థిక శాఖ స్పెషల్  సీఎస్ రామకృష్ణారావు, సెక్రటరీ టి.కె.శ్రీదేవి, జాయింట్ సెక్రెటరీ కె.హరిత, డిప్యూటీ సీఎం ఓఎస్డీ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.