తెలంగాణ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 2026-2027 విద్యాసంవత్సరం నుంచే విద్యార్థులకు అడ్వాన్స్డ్ ఫీజు రీయింబర్స్మెంట్ అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. అంటే.. ఏడాది ముందే విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయబడుతుందన్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న నెల రోజుల్లోపే డబ్బులు అకౌంట్లో జమ అవుతాయన్నారు.
ఇందుకోసం ప్రతీ ఏటా రూ. 2,400 కోట్ల అడ్వాన్స్ ఫీజు రీయింబర్స్మెంట్ను కేటాయిస్తుండగా.. ఈ ఏడాది ఇప్పటికే రూ. 250 కోట్లను బ్యాంకుల్లో జమ చేసినట్లు వెల్లడించారు.ఇకపై కాలేజీ ఫీజుల కోసం విద్యార్థులు రోడ్డెక్కాల్సిన అవసరం లేదు, సర్టిఫికెట్ల కోసం కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పనే లేదన్నారు.
విద్యార్థులు అడగకముందే నిధులు ఇస్తున్నామని, ఫీజులు కట్టలేదంటూ ఏ ఒక్క విద్యార్థి చదువు కూడా ఆగదని రేవంత్ భరోసా ఇచ్చారు. అయితే కేవలం సర్టిఫికెట్లు ఉంటే సరిపోదని, విద్యార్థులకు స్కిల్ ఉందా లేదా అనేదాని బట్టే భవిష్యత్తులో ఉద్యోగాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.
ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లపై ఉన్న మహానీయుల విగ్రహాలు కేవలం విగ్రహాలు కావని, అవి మనకు అందించిన గొప్ప త్యాగాలని రేవంత్ గుర్తుచేశారు. 150 ఏండ్ల క్రితమే చదువు ఒక్కటే ఆయుధమని చెప్పిన పూలే దంపతుల ఆశయాలను తాము కొనసాగిస్తున్నామన్నారు. కుల వ్యవస్థ నిర్మూలన, అందరికీ సమాన విద్య కోసం అన్ని కులాల పిల్లలు ఒకే చోట చదువుకునేలా యంగ్ ఇండియా స్కూళ్లు నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు రేవంత్ .
