
హైదరాబాద్: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాకిస్థాన్తో యుద్ధం చేసి.. బంగ్లాదేశ్ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేశారని.. నీకు దమ్ముంటే దమ్ముంటే పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ను వీడిదీయాలని ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు. అలాగే.. ఆపరేషన్ సిందూర్ దాడుల సమయంలో పాకిస్థాన్ మన రాఫెల్ యుద్ధ విమానాలను ఎన్నింటిని కూల్చేసిందో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు గురువారం (మే 29) టీపీసీసీ జైహింద్ యాత్ర చేపట్టింది. ఈ మేరకు మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో జైహింద్ ర్యాలీ నిర్వహించారు.
సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కేజీఆర్ కన్వెన్షన్ లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మన భూభాగాన్ని చైనా అక్రమిస్తుంటే ప్రధాని మోడీ ఏం చేశారు. యుద్ధం అంటే ధైర్యం ఉండాలి. తంత్రం ఉండాలి. యుద్ధం చేయడమంటే మైకుల ముందు పెద్ద పెద్ద స్పీచులు ఇచ్చుడు కాదు.
1962లో ఇందిరాగాంధీ చైనాను ఓడించారు. అనాడు పాకిస్థాన్తో యుద్ధం వేళ అమెరికా ప్రెసిడెంట్ ఇందిరాగాంధీని బెదిరించారు. కానీ గుండె ధైర్యంతో యూఎస్ ప్రెసిడెంట్కు ఆమె ధీటైన జవాబిచ్చారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే బొంద పెడ్తామని హెచ్చరించారు. పహల్గాంలో అమాయకులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. మన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా ఉగ్రదాడి జరిగింది. దీంతో ఇందిరా గాంధీని ఆదర్శంగా తీసుకుని పాకిస్థాన్తో యుద్ధం చేయాలని ప్రధాని మోడీని కోరాం. ఉగ్రవాదులొచ్చి దాడి చేస్తే రాజకీయాలకు అతీతంగా అంతా ఒక్కటయ్యాం.
భారతీయుల గుండెల్లో తూటాలు దించిన ఒక్కడు బతకొద్దని కోరాం. ఉగ్రవాదులను పెంచి పోషిస్తోన్న పాక్ను ప్రపంచపటంలో లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశాం. దేశ భద్రత విషయంలో మనమందరం ఒక్కటవ్వాలని అనుకున్నాం. ఇందులో భాగంగానే ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చాం. పాక్కు బుద్ధి చెప్పడానికి ఇదే సరైన సమయం అని చెప్పాం. యుద్ధం చేయమని ప్రధాని మోడీకి వీర తిలకం దిద్ది పంపాం.
నాలుగు రోజుల తర్వాత ఏమైందో తెలియదు కానీ అర్ధాంతరంగా యుద్ధాన్ని ఆపేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడే మోడీ యుద్ధాన్ని ఆపేశారు. యుద్ధాన్ని ఆపేశారని ట్రంప్ ప్రకటన చేసేదాక ఎవరికీ తెల్వదు. 140 మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్ దగ్గర మోడీ తాకట్టు పెట్టారు. యుద్ధాన్ని ఆపాలనుకున్నప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదు..? బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న తిరంగా ర్యాలీలో కాంగ్రెస్ను విమర్శిస్తోంది. అసలు యుద్ధంలో ఏం సాధించారని తిరంగా ర్యాలీలు చేస్తున్నారు.
చనిపోయిన సైనికుల పరిస్థితి ఏంటీ.. ఆ వివరాలు ఎందుకు చెప్పరు..? దేశ భద్రత విషయంలో ప్రధాని మోడీ సొంత విధానం పనికిరాదు. 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్ దగ్గర మోడీ తాకట్టు పెట్టారు. పాక్ నుంచి పీవోకేను గుంజుకోవాలని మేం ముందు నుంచి చెప్తున్నాం. కానీ ఆ పని చేయడానికి ఎవరికీ భయపడ్డారు.. ఎవరికీ లొంగిపోయారు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సైనికులకు అండగా ఉండటానికే జైహింద్ ర్యాలీ నిర్వహించామని పేర్కొన్నారు.