ప్రభుత్వంలో కొందరు అధికారులు కేసీఆర్ కోవర్టులుగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలు అక్కడక్కడ ఉన్నాయని... అవి రాష్ట్రంలో వాసనలను వెదజల్లుతున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా వరకూ పీకిపారేశానని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి మొక్క లేకుండా చేస్తానని.. అందుకోసం రోజుకు18 గంటలు పనిచేస్తాన్నారు సీఎం.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవ్వరిపై కక్ష్య సాధింపు చర్యలు ఉండవని... తప్పు చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పదే పదే అంటున్నారని మండిపడ్డారు. వాళ్లు పడగొడుతుంటే చూస్తూ ఉంటామా.. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అని పెద్దలు చెప్పారు.. కొట్టకుండా ఊరుకుంటామా అని హెచ్చరించారు.