స్కిల్ యూనివర్సిటీని స్పీడప్ చేయండి

స్కిల్ యూనివర్సిటీని  స్పీడప్ చేయండి
  • ఈ నెల 23లోగా ప్రతిపాదనలు పంపించండి: సీఎం రేవంత్
  • పరిశీలించి 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటం
  • ప్రైవేటు భాగస్వామ్యంతోనా? ప్రభుత్వ నిర్వహణలోనేనా ఆలోచించండి
  • ఐఎస్​బీ తరహాలో  తాత్కాలిక బోర్డు ఏర్పాటు
  • అధికారులు, పారిశ్రామిక వేత్తలతో సీఎం రివ్యూ
  • పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్​బాబు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు పనులు స్పీడప్​చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెలాఖరున జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ముందే జులై 23 లోగా స్కిల్ యూనివర్సిటీపై స్పష్టమైన ప్రతిపాదనలతో రిపోర్టు సమర్పించాలని పరిశ్రమల శాఖ, విద్యాశాఖ అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సూచించారు. వాటిని పరిశీలించి 24 గంటల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్​ ఇండియా(ఈఎస్​సీఐ)లో పారిశ్రామికరంగ ప్రముఖులతో సీఎం స్కిల్ డెవలప్​మెంట్ యూనివర్సిటీపై సమావేశమయ్యారు. 


డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. వర్సిటీ ఏర్పాటుపై అధికారులు, ప్రముఖుల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈఎస్​సీఐ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. అటు ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటికీ అందుబాటులో ఉన్నందున అక్కడ వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని చెప్పారు.

స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్ బీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చర్చ జరిగింది. అప్పటి వరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ యూనివర్సిటీలో ఏమేం కోర్సులుండాలి, ఎలాంటి సిలబస్ ఉండాలి.. పరిశ్రమల అవసరాలు తెలుసుకొని, వాటికి అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే నైపుణ్యాలు పెంచడంపై స్టడీ చేయాలని సీఎం సూచించారు.

మోడర్న్ టెక్నాలజీ అందించేలా ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరిక్యులమ్, కోర్సులకు సంబంధించి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించాలని చెప్పారు.

నోడల్ డిపార్ట్​మెంట్​గా పరిశ్రమల శాఖ

నిర్ణీత గడువు పెట్టుకొని ప్రతిపాదనలు రూపొందించాలని, కేవలం 15 రోజుల వ్యవధి ఉన్నందున ప్రతీ ఐదు రోజులకోసారి సమావేశం కావాలని సీఎం రేవంత్​రెడ్డి వారికి దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలా.. ప్రభుత్వమే ఈ బాధ్యతలను చేపట్టాలా.. మరేదైనా విధానం అనుసరించాలా.. అనేది కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్ని తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్సల్టెంట్ ను నియమించుకోవాలని సీఎం చెప్పారు.

యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమల శాఖ నోడల్ డిపార్టుమెంట్ గా వ్యవహరిస్తుందన్నారు. ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, ఇన్వెస్ట్ మెంట్స్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ విష్ణు వర్ధన్ రెడ్డి, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ చైర్మన్ సతీశ్ రెడ్డి, భారత్ బయోటెక్ హరి ప్రసాద్, క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి, ఐ ల్యాబ్స్ శ్రీనిరాజు రివ్యూలో పాల్గొన్నారు.

అంతకు ముందు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ ను సీఎం పరిశీలించారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు కలియ తిరిగి అందులో ఉండే సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడే కాలేజీ సిబ్బందితో కలిసి గ్రూప్​ ఫొటో దిగారు.