
- సినీ కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలి
- ఫిల్మ్ ఇండస్ట్రీలో నైపుణ్యాల పెంపు కోసం కార్పస్ ఫండ్
- నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి పాలసీ తీసుకువద్దాం.. ఇండస్ట్రీకి కూడా మానిటరింగ్ అవసరం
- నిర్మాతలు, దర్శకులతో భేటీలో వెల్లడి
- ఇయ్యాల ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సినీ పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందేనని చెప్పారు. సినీ పరిశ్రమ విషయంలో తాను న్యూట్రల్ గా ఉంటానన్నారు. సినీ కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువద్దామని సూచించారు. స్కిల్ యూనివర్సిటీలో సినీ పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
ఆదివారం సినీ నిర్మాతలు, దర్శకులతో జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని, పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని సినీ కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ‘‘ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుంది. అయితే పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలి.
తెలంగాణలో ముఖ్యమైన పరిశ్రమ సినిమా. ఈ పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించాను. పరిశ్రమలో నిర్మాతలు, కార్మికుల అంశంలో సంస్కరణలు అవసరం. సినీ కార్మికులను, నిర్మాతలను కూడా మా ప్రభుత్వం కాపాడుకుంటుంది” అని ఆయన తెలిపారు. సినిమా పరిశ్రమకు కూడా మానిటరింగ్ అవసరమన్నారు. పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందామని తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో ఉంచడమే మా ధ్యేయం
హైదరాబాద్లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతున్నదని.. తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమను ఉంచడమే తమ ధ్యేయమని చెప్పారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేశ్బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డీవీవీ దానయ్య, వంశీ, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల తదితరులు పాల్గొన్నారు.