ఆషాఢమాసం మాసంలో శ్రీమహావిష్ణువును, శివుడిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. ఈ ఏడాది ఆషాడ మాసం జులై 15 న ప్రారంభమై ఆగస్టు 12 న ముగుస్తుంది. ఈ మాసంలో శ్రీమహావిష్ణువును, శివుడిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. ఈ నెలరోజుల్లో ఎన్ని పండుగలున్నాయో తెలుసుకుందాం. .
హిందూ మతంలో ఆషాఢ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రం...వైశాఖం .....జేష్ట మాసాల తర్వాత వచ్చే నాల్గవ మాసం ఆషాఢమాసం.అయితే ఈ ఏడాది అధిక మాసం వచ్చింది. సాధారణంగా ఆషాఢమాసం రుతుపవనాల ప్రారంభాన్ని సూచిస్తుంది. మతపరమైన దృక్కోణంలో, ఆషాడ మాసం చాలా ముఖ్యమైనది.
జులై 15 వారాహీ నవరాత్రులు ప్రారంభం ( ఆషాఢ శుద్ధ పాడ్యమి) : ప్రతి ఏటా ఆషాడ మాసంలో పాడ్యమి నుంచి నవమి ( జులై 23) వరకూ తొమ్మిది రోజుల పాటూ వారాహీ నవరాత్రులు నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజు శరన్నరాత్రుల్లానే దీక్షగా అమ్మవారిని పూజిస్తారు. ఉపవాసాలుంటారు. వారాహీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే అన్నింటా విజయం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు.
జులై 16 బోనాలు : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల సందడి ఏటా ఆషాఢంలో వచ్చే తొలి గురువారం లేదా తొలి ఆదివారం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జులై 16 గురువారంతో బోనాల సందడి ఇదే రోజు ప్రారంభమవుతుంది. అంటువ్యాధులు ప్రబలకుండా రక్షించాలని ఆరోగ్యాన్నివ్వాలని అమ్మకు బోనం సమర్పిస్తారు
జులై 16 పూరీ జగన్నాథ రథయాత్ర ( ఆషాఢ శుద్ధ విదియ): ఆషాఢమాసం రెండో రోజైన విదియ రోజు పూరీ జగన్నాథుడి రథయాత్ర వైభవంగా జరుగుతుంది. ఏడాదంతా గర్భగుడిలో పూజలందుకునే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఈ నెలలో భక్తజనం మధ్యకు వస్తారు. పది రోజుల పాటూ ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతాయి.
జూలై 25 తొలి ఏకాదశి: దేవతలకు పగటి కాలాన్ని ఉత్తరాయణం అని, రాత్రి కాలాన్ని దక్షిణాయనం అని చెబుతారు. ఆషాఢంలో వచ్చే ఈ ఏకాదశి రోజే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడని పురాణాల్లో ఉంది. అంటే దేవతలకు రాత్రి కాలం ప్రారంభమైందని చెప్పేందుకు సూచన ఇది.
జూలై 29 గురు పూర్ణిమ: వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడయ్యాడు కృష్ణ ద్వైపాయనుడు. వేదాలు మాత్రమే కాదు మహాభారతం, భాగవతం సహా అష్టాదశపురాణాలు అందించాడు వ్యాసుడు. ఆయన అందిన ఆధ్యాత్మిక సంపద కారణంగా ఆదిగురువుగా పూజిస్తారు. వ్యాసమహర్షి జన్మతిథి అయిన ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ రోజు గురువులకు నమస్కరించి ఆశీర్వాదం పొందుతారు.
ఆగస్టు 2 సికింద్రాబాద్ మహంకాళి జాతర: హైదరాబాద్, సికింద్రాబాద్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కుండలో భోజనం వండి గ్రామ దేవతలకు భక్తిశ్రద్ధలతో బోనం సమర్పిస్తారు. జ్యోతులతో కనుల పండుగ అమ్మవారి ఆలయాలకు వెళ్లి తొట్టెల కూడా సమర్పిస్తారు.ఉజ్జయిని మహాకాళి దేవస్థానం సికింద్రాబాద్లో ఆగస్టు 2న అమ్మవారికి బోనాలు సమర్పణ, ఆగస్టు 3 రంగం (భవిష్యవాణి) అమ్మ వారిని అంబారిపై ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది . ఈ రెండు రోజులలో భక్తులు, ప్రజలు లక్షల్లో తరలి వస్తారు.
ఆగస్టు 9 లాల్ దర్వాజా సింహవాహినికి బోనాలు: లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో అమ్మవారికి గస్టు 9 వ తేదీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు బోనాల సమర్పిస్తారు. వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధుల నుంచి రక్షించాలని ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో... అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితిగా వస్తుంది
ఆగస్టు 12 చుక్కల అమావాస్య :ఆ రోజుతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. ఈ అమావాస్యనే చుక్కల అమావాస్య అని పిలుస్తారు. ఆ రోజు వివాహిత మహిళలు దీపస్తంభ వ్రతం ఆచరించి శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారు. సంతానం, సౌభాగ్యం కోసం ముత్తయిదువులు ఈ నోము నోచుకుంటారు. ఆగస్టు 13 నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది...
ఆషాఢమాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ( నీరు) సమర్పించి .... పూజలు చేస్తే రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆషాడ మాసంలో శ్రీమహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ఎర్రటి పూలు, తామరపూలు సమర్పించడం వల్ల విష్ణుమూర్తికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. అంతేకాదు ఆషాడమాసంలో దానధర్మాలు చేస్తే మంచి ఫలితాలుంటాయని, లక్ష్మీ కటాక్ష్మి వస్తుందని చెబుతారు. కాబట్టి ఆషాఢమాసం విశిష్టతను గుర్తించి పూజించాలని పండితులు చెబుతున్నారు.
