శివనామ స్మరణతో ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్.. అంటే ఐఆర్సీటీసీ (IRCTC) ఒక సూపర్ ఆఫర్ను తీసుకువచ్చింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా దేశంలోని అత్యంత పవిత్రమైన నాలుగు జ్యోతిర్లింగాలను దర్శించుకునే ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. 9 రాత్రులు, 10 రోజుల పాటు సాగే ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర ఆగస్టు 17న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభం కానుంది.
ఈ ప్యాకేజీలో మధ్యప్రదేశ్లోని ప్రముఖ మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలతో పాటు.. గుజరాత్లోని నాగేశ్వర్, సోమనాథ్ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. వీటితో పాటే ద్వారకాధీష్ ఆలయం, బేట్ ద్వారకా, సిగ్నేచర్ బ్రిడ్జ్, ప్రపంచంలోనే ఎత్తైన స్టాట్యూ ఆఫ్ యూనిటీ'ని సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు.
ప్రయాణికుల బడ్జెట్ను బట్టి స్లీపర్ క్లాస్ ధర రూ.18,380 , థర్డ్ ఏసీ ధర రూ 29,570, సెకండ్ ఏసీ ధర రూ. 38,870గా నిర్ణయించారు. ఈ టికెట్ ధరలోనే ప్రతిరోజూ ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో రుచికరమైన శాకాహార భోజనం, స్థానిక సందర్శన కోసం బస్సు సౌకర్యం కల్పిస్తారు. అంతేకాదు, దీనికి ఈఎంఐ (EMI), ఎల్టీసీ (LTC) సదుపాయాలు కూడా కలవు. ఆన్లైన్లో ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ ప్రయాణాన్ని బుక్ చేసుకోవచ్చు.
