తెలంగాణలో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరుగురి దారుణ హత్యల కేసులో కీలక మలుపు. మూడు రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న కిరాతకుడు రాజ్ కుమార్ సూర్యాపేటలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. తాజా సమాచారంతో ప్రత్యేక పోలీస్ బృందాలు సూర్యాపేటకు హుటాహుటిన తరలివెళ్లాయి. అయితే, నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ లభ్యమైందనే వార్తలపై పోలీసులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆ కిరాతకుడు పోలీసులకు చిక్కాడా? లేక ఇంకా పరారీలోనే ఉన్నాడా అనేది మరికొద్దిసేపట్లో తేలనుంది. హంతకుడి ఆచూకీ తెలిపిన వారికి ఇప్పటికే 2 లక్షల రూపాయల భారీ రివార్డును కూడా ప్రకటించారు పోలీసులు.
శుక్రవారం అర్ధరాత్రి హత్యలు చేసిన అనంతరం రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో చివరి సారి నిందితుడి కదలికల్ని గుర్తించారు. సీడీఆర్, ఇతర సాంకేతికత ఆధారంగా రాజ్కుమార్ మొత్తం నాలుగు సెల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులు వాడినట్లు గుర్తించారు. వీటిని గేమింగ్, బెట్టింగ్ యాప్స్ కోసం వినియోగించినట్లు ఆధారాలు సేకరించారు. శుక్రవారం రాత్రి వరుస హత్యల అనంతరం11.50 గంటలకు నిందితుడు ఫోన్ స్విచాఫ్ చేశాడు. ప్రస్తుతం ఫోన్లు, 16 సిమ్ కార్డుల్లో ఒక్కటి కూడా వాడటంలేదని గుర్తించారు.
బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మ సహా తన భార్య పిల్లలను హతమార్చిన అనంతరం రాజ్కుమార్ తన తండ్రికి చివరి కాల్ చేశాడు. ఆరుగురిని చంపానని.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని తండ్రితో చెప్పిన తర్వాత మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సెల్ఫ్ డ్రైవ్ కారులో నందిగామ, కొత్తూరు, షాబాద్ మండలాల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో తిరిగాడు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో కొత్తూరు మండలం తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే కారులో పెట్రోలు అయిపోయింది. దీంతో నిందితుడు కారును అక్కడే వదిలేశాడు. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో పట్టాలపై రైలుకు ఎదురుగా వెళ్లి నిలబడ్డట్టు పోలీసులు గుర్తించారు. పట్టాల మీద కొద్దిసేపు నిలబడిన అతడు రైలు దగ్గరికి రాగానే పక్కకు తప్పుకున్నట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయినట్టు తెలిసింది. ఈ మేరకు రైల్వే స్టేషన్, ట్రాక్ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన సీసీటీవీల ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
