- సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురి సంతాపం
హైదరాబాద్, వెలుగు: పీసీసీ సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమ నాయకుడు టి.నాగయ్య మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో నాగయ్య కీలకపాత్ర పోషించారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని సీఎం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి తన జీవితకాలం పార్టీ విస్తరణకు కృషి చేశారని రేవంత్ కొనియాడారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేత కోదండ రెడ్డి తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. సోమవారం గాంధీ భవన్ లో నాగయ్య ఫొటోకి పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్, ఆనంతుల శ్యామ్ మోహన్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో నాగయ్య పనిచేశారని, వెనుకబడిన వర్గాల వారి అభివృద్ధి కోసం కృషి చేశారని అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో నాగయ్య కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తుచేశారు. నాగయ్య మరణం తెలంగాణ పద్మశాలి సమాజానికి, చేనేత జాతికి తీరని లోటని చేనేత విభాగం అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మాజీ ఎంపీ మధు యాష్కీ కూడా ఓ ప్రకటనలో నాగయ్య మృతికి సంతాపం తెలిపారు.