గుజరాత్ టీమ్​ను డకౌట్ చేద్దాం: సీఎం రేవంత్

గుజరాత్ టీమ్​ను డకౌట్ చేద్దాం: సీఎం రేవంత్
  • తెలంగాణ ప్రాజెక్టులన్నీ మోదీ సొంత రాష్ట్రానికే తరలించుకున్నడు
  • పదేండ్లలో ఏమివ్వని ప్రధాని.. ఏ మొఖం  
  • పెట్టుకుని వరంగల్​కు వస్తున్నడు
  • కాంగ్రెస్​ను దెబ్బకొట్టడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు
  • ఈసీకి ఫిర్యాదు చేసి రైతు భరోసాను అడ్డుకున్నయ్ 
  • బిడ్డ బెయిల్ కోసం మోదీ కాళ్ల దగ్గర బీఆర్ఎస్ తాకట్టు 
  • కేసీఆర్ అమ్ముడుపోవడంతోనే రాష్ట్రానికి ఏమీ రాలేదని ఫైర్   
  • వరంగల్​ను రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని హామీ 
  • గ్రేటర్ వరంగల్​లో కార్నర్ మీటింగ్స్​లో పాల్గొన్న సీఎం

వరంగల్‍/హనుమకొండ, వెలుగు: తెలంగాణ ప్రాజెక్టులను ప్రధాని మోదీ గుజరాత్​కు తరలించుకుపోయారని, లోక్​సభ ఎన్నికల్లో గుజరాత్ టీమ్​ను డకౌట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘రాష్ట్రంలో డిసెంబర్‍ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్‍. ఇప్పుడు 13న జరిగే లోక్​సభ ఎన్నికలు తెలంగాణ వర్సెస్‍ గుజరాత్‍ ఫైనల్‍ మ్యాచ్‍. ఈ ఎన్నికల్లో ఎవ్వడు గెలుస్తడో చూస్కుందాం రా” అని మోదీకి సవాల్ విసిరారు. ‘‘మనం డిసెంబర్‍లో గెలిచింది సెమీఫైనల్‍ మాత్రమే. ఫైనల్స్ ఇప్పుడున్నయ్‍. అసలు కథ ఇప్పుడు మొదలైంది. తెలంగాణ వర్సెస్‍ గుజరాత్‍. అటుపక్కన నరేంద్రమోదీ, అమిత్‍ షా.. ఇటు పక్కన మీ అన్న ఉన్నడు.. రాహుల్‍ గాంధీ ఉన్నడు. మే 13న ఫైనల్లో గుజరాత్‍ టీమ్​ను డకౌట్‍ చేసి తుక్కుతుక్కుగా ఓడించాలి” అని ప్రజలను కోరారు. 

మంగళవారం వరంగల్‍ కాంగ్రెస్‍ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తరఫున వరంగల్‍ పశ్చిమ, తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్స్​లో రేవంత్ పాల్గొని మాట్లాడారు.

విభజన హామీలు ఏమైనయ్? 

విభజన చట్టంలోని హామీల్లో ఏమేం అమలు చేశారో చెప్పాకే ప్రధాని మోదీ, బీజేపీ లీడర్లు వరంగల్​లో అడుగుపెట్టాలని రేవంత్ అన్నారు. ‘‘సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ తెలంగాణ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్‍ ఫ్యాక్టరీ, రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్‍ ప్రాజెక్టు, ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ, మెదక్‍కు ఐఐఎం, నల్గొండకు ఐఐటీ ఇచ్చిన్రు. కానీ వాటిని ప్రధాని మోదీ అమలు చెయ్యలే. కాజీపేట కోచ్‍ ఫ్యాక్టరీని లాతూర్‍కు తరలించిన్రు. గిరిజన వర్సిటీని నిన్నగాక మొన్న మొదలుపెడ్తున్నట్లు చెప్పిన్రు. రామప్ప యునెస్కోలో చేరితే ఇచ్చిన నిధులెన్ని? వెయ్యి స్తంభాల గుడికి ఇచ్చిన గుర్తింపేది?” అని సీఎం రేవంత్​ ప్రశ్నించారు. 

కేసీఆర్.. తేల్చుకుందాం రా.. 

రైతు భరోసా పథకం అమలుపై చర్చించేందుకు ఈ నెల 9న అమరవీరుల స్తూపం వద్దకు రావాలని, అక్కడ తేల్చుకుందామని కేసీఆర్​కు రేవంత్ సవాల్‍ విసిరారు. ‘‘రైతు భరోసా డబ్బులు మే 9లోపు వేస్తా. ఒకవేళ వేయకుంటే నేను ముక్కు నేలకు రాస్తా.. లేదంటే నువ్వు రాయాలి” అని అన్నారు. ‘‘రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో అంతా సిద్ధం చేసినం. కానీ దొంగ దెబ్బ తీయడానికి బీఆర్‍ఎస్‍, బీజేపీ కలిసి కుట్ర పన్నాయి. రైతులకు డబ్బులు వేయకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి” అని మండిపడ్డారు. 13న ఎన్నికలు అయ్యాకే డబ్బులు జమ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని పేర్కొన్నారు. ‘‘2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‍ పార్టీ డబ్బులు పంపి, మెసేజ్‍లు పంపిస్తే అడ్డుకోలేదు. కానీ ఇప్పుడు మే 9లోపు రైతుల రుణం తీర్చుకోడానికి డబ్బులు వేస్తే.. బీజేపీ, బీఆర్ఎస్‍ కుట్ర చేశాయి. అయినా.. ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. ఎక్కడకు చేరాలో నగదు అక్కడకు చేరుతుంది. చంద్రశేఖర్‍రావు.. 9న అమరవీరుల స్థూపం వద్దకు రా.. తేల్చుకుందాం” అని సవాల్‍ విసిరారు. అల్లుడు హరీశ్ రావు ఆణిముత్యమైతే, మామ కేసీఆర్‍ స్వాతిముత్యం అని విమర్శించారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యమకారులు, మహిళల గురించి ఆలోచించలేదని ఫైర్ అయ్యారు. 

నేనేం అల్లాటప్పా కాదు.. 

కేసీఆర్ దిగిపొమ్మంటే దిగిపోవడానికి తానేం అల్లాటప్పా కాదని రేవంత్ అన్నారు. ‘‘రేవంత్‍రెడ్డి దిగాల్సిందే.. కాంగ్రెస్‍ పార్టీ పోవాల్సిందే అని కేసీఆర్‍ అంటున్నడు. ఆయన దిగిపొమ్మంటే దిగిపోవడానికి ఈడ అల్లాటప్ప ఎవరూ లేరు. ఏదో పిలగాడు కదా సూద్దామనుకుంటున్నావేమో.. నేను వరంగల్‍ మిర్చి లెక్కనే. నువ్వు పదేండ్లు అధికారంలో ఉండి తెలంగాణను విధ్వంసం చేస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టిన్రు.. బోర్లపడేసి బొక్కలిరగొట్టిన్రు.. అయినా నీ బుద్ధి మారలేదు.. నీ వంకర ఆలోచనల్లో మార్పు రాలేదు” అని మండిపడ్డారు. ‘‘100 రోజుల్లో పని చేసిన నన్ను దిగమన్నవ్‍.. మరి పదేండ్లు ఢిల్లీలో గద్దె మీదున్న మోదీని అడిగినవా? నువ్వు అగడకుండా అమ్ముడుపోవుడు వల్లే.. నువ్వు మోదీ కాళ్ల దగ్గర తెలంగాణ తలకాయను తాకట్టుపెట్టినవ్‍.  మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినా..  గద్దె దిగాలని అంటున్నవ్.. పదేండ్లు అధికారంలో ఉండి ఏమీ చెయ్యని మోదీ మాత్రం 400 సీట్లలో గెలవల్నా.. 
ఇదేనా నీ నీతి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‍ తన బిడ్డ బెయిల్‍ కోసం బీఆర్ఎస్ పార్టీని మోదీ దగ్గర తాకట్టు పెట్టారని అన్నారు. బీజేపీ గెలుపు కోసం బీఆర్‍ఎస్‍ తరఫున డమ్మీ క్యాండేట్లను పెట్టారని
విమర్శించారు. 

కారు ఇక రాదు.. 

కారును జుమ్మెరాత్‍ బజార్​లో తూకానికి అమ్మాల్సిందేనని రేవంత్‍ అన్నారు. ‘‘కారు ఖరాబైంది.. మళ్లీ వస్తదని కేటీఆర్‍ అంటుండు. కేటీఆర్‍ తలకిందికి, కాళ్లు మీదకు పెట్టి తపస్సు చేసినా ఖరాబైన కారు రాదు.. ఇదంతా కేసీఆర్‍కు తెలుసు కాబట్టే కారు వదిలి బస్సు పట్టిండు” అని విమర్శించారు. ‘‘వరంగల్​లో కాంగ్రెస్‍ అభ్యర్థిని దొంగ దెబ్బ కొట్టడానికి బీఆర్‍ఎస్‍, బీజేపీ చేతులు కలిపాయి. ఇందులో భాగంగానే కొత్త ఇంటిముందు దిష్టిబొమ్మ లాంటి డమ్మీ అభ్యర్థికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు” అని అన్నారు. హైదరాబాద్‍ తర్వాత రెండో రాజధానిగా వరంగల్​ను అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

స‌‌‌‌హాయ‌‌‌‌క చ‌‌‌‌ర్యలు చేప‌‌‌‌ట్టండి 

భారీ వ‌‌‌‌ర్షం, ఈదురుగాలుల‌‌‌‌తో హైద‌‌‌‌రాబాద్​లోత‌‌‌‌ట్టు ప్రాంతాల జ‌‌‌‌ల‌‌‌‌మ‌‌‌‌యం,  ట్రాఫిక్ స‌‌‌‌మ‌‌‌‌స్య, విద్యుత్ అంత‌‌‌‌రాయంపై సీఎం రేవంత్ రెడ్డి స‌‌‌‌మీక్షించారు. వ‌‌‌‌రంగ‌‌‌‌ల్ ప‌‌‌‌ర్యట‌‌‌‌న‌‌‌‌లో ఉన్న ఆయన అక్కడి నుంచే జీహెచ్ఎంసీ క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ రోనాల్డ్ రోస్‌‌‌‌, సిటీ పోలీస్ క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ కె.శ్రీ‌‌‌‌నివాస రెడ్డి, ట్రాన్స్‌‌‌‌కో సీఎండీ ఎస్‌‌‌‌.ఏ.ఎం రిజ్వి ఇత‌‌‌‌ర ఉన్నతాధికారుల‌‌‌‌తో సమావేశమయ్యారు. సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంట‌‌‌‌నే కరెంట్ సప్లయ్ అయ్యేలా చూడాలని,  లోతట్టు ప్రాంతాల ప్రజ‌‌‌‌ల‌‌‌‌కు చేయూత‌‌‌‌ను అందించాల‌‌‌‌ని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ స‌‌‌‌మ‌‌‌‌స్యను క్లియ‌‌‌‌ర్ చేయాలని పోలీసులకు సూచించారు.

కరీంనగర్​ సభ రద్దు

ఈదురు గాలులు, వర్షం కారణంగా కరీంనగర్ లో మంగళవారం సాయంత్రం నిర్వహించాల్సిన కాంగ్రెస్  జనజాతర సభ రద్దయింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్  కాంగ్రెస్  అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో కరీంనగర్ లోని  ఎస్ఆర్ఆర్  కాలేజీ  గ్రౌండ్ లో సాయంత్రం 5 గంటలకు సభ నిర్వహహణకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు  ఈదురు గాలులతో వర్షం కురిసింది. సభ కోసం వేసిన టెంట్లు కూలడంతో బందోబస్తులో ఉన్న ఓ సీఐకి గాయాలయ్యాయి. సీఎం రేవంత్ హెలికాప్టర్ లో వచ్చేందుకు వాతావరణం అనుకూలంగా లేదని చివరి నిమిషంలో సభను రద్దు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్  తెలిపారు.

దేశమంటే గుజరాతేనా: సీఎం రేవంత్

మోదీ.. దేశమంటే గుజరాతేనా? గుజరాత్‍కే బుల్లెట్‍ ట్రైన్‍ ఇస్తవ్‍.. గుజరాత్‍కే సబర్మతి రివర్‍ ఫ్రంట్‍ ఇస్తవ్‍.. గుజరాత్‍కే గిఫ్ట్ సిటీ ఇస్తవ్‍.. తెలంగాణకు వచ్చిన పరిశ్రమలన్నీ గుజరాత్‍కే తరలిస్తవ్‍.. చివరకు దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన కాజీపేట జంక్షన్‍ను రద్దు చేసే పరిస్థితి తెచ్చినవ్. ప్రధానిగా పదేండ్లు వరంగల్‍కు ఏమియ్యకుండా.. ఇప్పుడు వచ్చి ఓట్లు ఎట్ల అడుగుతవ్. వరంగల్‍కు గాడిద గుడ్డు ఇచ్చిన అని చెప్పి ఓట్లు అడుగుతవా?