టీఎస్పీఎస్సీ ప్రక్షాళన!.. కొలువుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్

టీఎస్పీఎస్సీ ప్రక్షాళన!.. కొలువుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్

హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు పడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రెండు లక్షల కొలువులు భర్తీ చేస్తామని ఎన్నికలకు మందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు వీలుగా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసేందుకు సర్కారు సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన పాలకమండలి చైర్మన్, సభ్యులు ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొత్త పాలక మండలి ఏర్పాటు, విధి విధానాలు, పరీక్షల నిర్వహణ, జాబ్ క్యాలెండర్ల విడుదల తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఓ బృందం కేరళను సందర్శించింది. తిరువనంతపురంలోని కేరళ పబ్లిక్ సర్వీస్  కమిషన్ అధికారులతో భేటీ అయ్యింది. 

ఢిల్లీలో  ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు యూపీఎస్సీ కార్యాలయానికి వెళ్లారు. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ మీనన్ తో భేటీ అయ్యారు. ఆయన వెంట నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు పరీక్షల నిర్వహణ తీరుపై చర్చించారు. యూపీఎస్సీలో 11 మంది సభ్యులుంటారని, వాళ్లంతా రాష్ట్రపతి ఆధీనంలో పనిచేస్తారని మనోజ్ మీనన్ రేవంత్ రెడ్డి చెప్పారు. 

ఒక్కో సభ్యుడి పదవీకాలం ఆరేళ్ల పాటు ఉంటుందని ఈ సందర్భంగా వివరించినట్టు తెలుస్తోంది. ఇదే తరహాను రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భావిస్తోంది. యూపీలో అవకతవకలు జరిగిన సమయంలో అక్కడి సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా యూపీఎస్సీని సందర్శించి అదే ఫార్ములాను ఉత్తర ప్రదేశ్ లోనూ ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలోనూ యూపీఎస్సీ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేసేందుకు చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.