
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్ గణ్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ఇద్దరు కలిసి పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసించారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ వివరించారు. దక్షిణ కొరియాతో పాటు పలు దేశాల్లో తాము సందర్శించిన క్రీడా యూనివర్సిటీలు.. అక్కడి క్రీడా ప్రముఖులతో జరిగిన భేటీల వివరాలను ప్రస్తావించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు తెలంగాణలో క్రీడాభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల్లో భాగస్వామి కావడానికి సిద్ధంగా ఉన్నట్టు కపిల్ దేవ్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ALSO READ | 60 మంది మహిళల్ని ఎమ్మెల్యేలుగా చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో సినీ నిర్మాణంలో కీలకమైన యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇతర సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమణాలతో కూడిన స్టూడియో నిర్మాణానికి అవకాశం కల్పించాలని అజయ్ దేవ్ గణ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మాణంతో పాటు సినీ పరిశ్రమలో పలు విభాగాలకు అవసరమైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అజయ్ దేవ్ గణ్ సిద్దంగా ఉన్నట్లు సీఎంకు చెప్పారు. తెలంగాణ అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పలు రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ వివరించారు. తెలంగాణ రైజింగ్కు సంబంధించి మీడియా, సినిమా రంగాలకు ప్రచారకర్తగా ఉంటానని అజయ్ దేవ్ గణ్ సీఎంకు తెలియజేశారు.