
రాజీవ్ గాంధీ స్ఫూర్తితో రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు విశ్రమించబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ ఈ దేశ యువతకు స్పూర్తి అని అన్నారు. మాజీ ప్రధాని,దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు సీఎం రేవంత్.
ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్.. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ ప్రాణ త్యాగం చేశారని చెప్పారు. మహిళా రిజర్వేషన్లకు పునాది వేసిందే రాజీవ్ గాంధీ అని తెలిపారు. దేశంలో ఐటీ రంగం అభివృద్ది రాజీవ్ చొరవే అని అన్నారు. టెలికాం రంగంలో రాజీవ్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని చెప్పారు రేవంత్. దేశంలో టెక్నాలజీకి అడుగులు వేయించారని తెలిపారు.
రాజీవ్ స్ఫూర్తితో తెలంగాణను ఆర్థికంగా,సామాజికంగా ముందుకు తీసుకెళ్తామన్నారు రేవంత్. సంక్షేమం, అభివృద్ధితో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకుని 21 ఏళ్లు నిండిన వారు శాసన సభకు పోటీ చేసేలా చట్టాన్ని సవరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఆ కలలన్నీ సాకారం కావాలంటే దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు రేవంత్. రాజీవ్ గాంధీ ఆనాడు 18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి దేశ భవిష్యత్ ను నిర్ణయించే అవకాశం కల్పించారని తెలిపారు రేవంత్ .